శ్రీశైల దేవస్థానం: శ్రీశైల నియోజకవర్గ శాసనసభ్యులు శిల్పాచక్రపాణిరెడ్డి ఈ రోజు 18 న ఉదయం శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. తరువాత పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు.ముందుగా దేవస్థానం టోల్ గేట్ సమీపములో వలయ రహదారి(రింగురోడ్డు) వద్ద మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగాను, , క్షేత్రాన్ని మరింతగా సుందరీకరించేందుకు క్షేత్ర పరిధిలో పలుచోట్ల మొక్కలను నాటుతున్నారు. ముఖ్యంగా వలయ రహదారికి యిరువైపులా, ఆరుబయలుప్రదేశాలలోనూ, దేవస్థానం ఉద్యానవనాలలోనూ ఈ మొక్కలను నాటుతున్నారు. ఆయా ప్రదేశాలలో రావి, జువ్వి, తెల్లమద్ది, కానుగ, నేరేడు, వేప, పొన్న మొదలైనవి నాటుతున్నారు.
శాసనసభ్యులు మాట్లాడుతూ క్షేత్రములో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు మరింతగా పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు. క్షేత్రపరిధిలో అనువైన చోట్ల ల్యాండ్ స్కేపింగ్ గార్డెనింగు చేయాలన్నారు. భక్తులు సేదతీరేవిధంగా ఉద్యానవనాలను తీర్చిదిద్దాలన్నారు.తరువాత ఘంటామఠ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యనిర్వహణాధి వారు పంచమఠాల పునర్నిర్మాణ వివరాలను శాసనసభ్యులవారికి వివరించారు. ప్రాచీన నిర్మాణ శైలికి ఎలాంటి విఘాతం కలగకుండా ఈ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయని కార్యనిర్వహణాధికారి తెలియజేశారు. భక్తులందరు పంచమఠాలను ఒకేసారి దర్శించుకునేందుకు వీలుగా అన్నిమతాలను కలుపుతూ (ఒకేసర్క్యూట్ గా) ఏకరహదారిని నిర్మించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా కార్యనిర్వహణాధికారి పేర్కొన్నారు.
శాసనసభ్యులు మాట్లాడుతూ పునర్నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే పంచమఠాల ప్రాంగణములో పచ్చదనాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. క్షేత్రాన్ని సందర్శించే భక్తులు పంచమఠాలను కూడా దర్శించేవిధంగా తగిన ప్రచారం కల్పించాలన్నారు. భక్తులు ధ్యానం, పారాయణం లాంటివి చేసుకునేందుకు వీలుగా ఈ పంచమఠాలను తీర్చిదిద్దాలన్నారు.
తరువాత శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ (సున్నిపెంట) నుంచి వచ్చే దేవస్థానం సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన దేవస్థానం బస్సును గంగాధర మండపం వద్ద ప్రారంభించారు.అనంతరం దేవస్థానం పెట్రోల్ బంకు లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి శాసనసభ్యుల వారి చేతుల మీదుగా ఏకరీతి వస్త్రాలను (యూనిఫామ్) అందించారు.