భవిష్యత్ అవసరాలకనుగుణంగా హైదరాబాద్ నగర రహదారులు పునర్నిర్మించాలి – ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్
ట్రాఫిక్ జామ్ బాధలు… వర్షాకాలంలో రోడ్లపైకి వచ్చే నీళ్లు… ఎక్కడ పడితే అక్కడ గుంతలు… అభివృద్ధి పనుల కోసం నిత్యం జరిగే తవ్వకాలు… రోడ్లపై ప్రవహించే మురికి నీరు… లాంటి అవస్థలేవీ లేకుండా, భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగర రహదారులను పునర్నిర్మించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నగర రోడ్లను అభివృద్ది చేయాలని, నిజాం కాలం నాటి రోడ్లు ఇప్పటికీ వాడుతున్నట్లే, ఇప్పుడు వేసే రోడ్లు మరో వందేళ్ల పాటు ప్రజలు వినియోగించుకునేలా తీర్చిదిద్దాలని చెప్పారు. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ తో కలిసి హైదరాబాద్ నగర రహదారుల అభివృద్ధిపై సమగ్ర అధ్యయనం చేసి, నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. నాలుగైదేళ్లలో దశల వారీగా రహదారుల పునర్నిర్మాణం పనులు చేయాలని చెప్పారు. మొదటి దశలో పైలట్ ప్రాజెక్టుగా వంద కిలోమీటర్ల మేర రహదారులను మెరుగు పరచాలని ఆదేశించారు. నగర రహదారుల అభివృద్ధిలో తాము కూడా భాగస్వాములం అవుతామని సిమెంట్ మాన్యుఫాక్చరింగ్ అసోసియేషన్ ముందుకొచ్చింది.
నగర రహదారుల పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలు, అభివృద్ధి అంశాలపై క్యాంపు కార్యాలయంలో బుధవారం సిఎం సమీక్ష నిర్వహించారు. మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటి. రామారావు, మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంజి గోపాల్, ఆర్ అండ్ బి సీనియర్ అధికారులు రవీందర్ రావు, గణపతి, ఎస్.పి.డి.సి.ఎల్. సిఎండి రఘుమారెడ్డి, మెట్రోరైలు ఎండి ఎంవిఎస్ రెడ్డి, ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ చైర్మన్ శ్రీనివాసన్, సిమెంట్ మాన్యుఫాక్చరింగ్ అసోసియేషన్ తెలంగాణ శాఖ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, మహా సిమెంట్స్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
హైదరాబాద్ నగర రహదారుల పరిస్థితి ఏమాత్రం బాగా లేదని, నిత్యం ట్రాఫిక్ జామ్ లతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, వర్షాకాలంలో బాధలు చెప్పలే నివి కానివని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకులు నగర రోడ్లపై వ్యూహాత్మకంగా వ్యవహరించలేదని, పెరుగుతున్న జనాభా, వాహనాలు, రవాణా అవసరాలకు తగినట్లు రహదారుల అభివృద్ధి జరగలేదని సిఎం అభిప్రాయపడ్డారు. గత పాలకులు చేసిన తప్పులనే ఇప్పుడు కూడా చేస్తే భవిష్యత్ తరం క్షమించదని సిఎం అన్నారు. దేశంలోని అతి కొద్ది మెట్రో నగరాల్లో హైదరాబాద్ ఒకటని, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం కూడా హైదరాబాదేనని చెప్పారు. ఇప్పటికైనా స్పందించి రహదారుల పరిస్థితిని మెరుగుపరచాలని అన్నారు. కరెంటు లైన్ల కోసం, టెలిఫోన్ల లైన్ల కోసం, డ్రైనేజీ మరమ్మతుల కోసం, మంచినీటి పైపుల కోసం నిత్యం రోడ్లను తవ్వేస్తున్నారని, ఇది కూడా ట్రాఫిక్ ఇబ్బందులకు ప్రధాన కారణంగా మారుతున్నదన్నారు. ఈ జాడ్యాలన్నీ పోయే విధంగా రహదారుల పునర్నిర్మాణం ఉండాలని సిఎం సూచించారు. రహదారులను బాగా వెడల్పు చేయాలని, నాలుగు లైన్లు, ఆరు లైన్ల రోడ్లు నిర్మించాలని, పాదాచారుల కోసం ప్రత్యేకంగా ఫుట్ పాత్ లు నిర్మించాలని, రహదారుల వెంటనే డక్ట్స్ తీయాలని చెప్పారు. ఆ డక్ట్స్ లోనే అన్ని రకాల కేబుళ్లు రావాలని చెప్పారు. భవిష్యత్తులో వేసే కేబుళ్లు కూడా డక్ట్స్ లోనే వేసే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఫ్లై ఓవర్లు, మెట్రో రైలు మార్గం వచ్చే ట్రాఫిక్ ఆగిపోకుండా కొత్త రహదారులను వ్యూహాత్మకంగా నిర్మించాలని చెప్పారు. దీనికోసం సమగ్ర అధ్యయనం అవసరమని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో అనుసరించే పద్దతులను కూడా అధ్యయనం చేయాలని చెప్పారు. మొదటి దశలో చేపట్టే వంద కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు. మూసీ నదికి రెండు వైపులా రహదారి నిర్మించాలని చెప్పారు. దేశమంతా ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తున్నదని, మంచి వాతావరణం, పెట్టుబడులకు అనుకూలమైన ప్రభుత్వ విధానాలున్నాయని, కానీ మౌలిక వసతులు మెరుగు పడాల్సి ఉందని, రహదారులు బాగుపడాల్సి ఉందని సిఎం అన్నారు. శివారు మున్సిపాలిటీలలో కూడా ప్రత్యేక ప్రణాళికతో రహదారులను అభివృద్ధి చేయాలని చెప్పారు. రహదారులను వెడల్పు, అభివృద్ది చేసే క్రమంలో ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవాలని, వారి సహకారం చాలా ముఖ్యమని సిఎం చెప్పారు. నగరంలో పడే ట్రాఫిక్ బాధలు అందరూ అనుభవిస్తున్నారు కాబట్టి, ప్రజలు కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని సిఎం అన్నారు.
హైదరాబాద్ నగరం ఎప్పుడో గ్రిడ్ లాక్ (నగరంలోని వాహనాలన్నీ ఒకేసారి రోడ్డు మీదికి వస్తే రోడ్లు సరిపోని పరిస్థితి) అయిందని, ఈ నేపథ్యంలో వ్యూహాత్మక రహదారుల వ్యవస్థను రూపొందించుకోవడమొక్కటే మార్గమన్నారు. నగరంలోకి వచ్చే ప్రధాన రహదారులను ఎక్స్ ప్రెస్ హైవేలుగా మార్చాలని, వీటిని కూడా నగర రోడ్ల సమగ్ర అభివృద్ధిలో భాగం చేయాలని సిఎం చెప్పారు. తన కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి చర్లపల్లి, నాగులపల్లిలో మరో రెండు అదనపు రైలు టర్మినళ్లను నిర్మిస్తున్నదని, దీనివల్ల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై వత్తిడీ తగ్గుతుందని చెప్పారు. ఇప్పుడున్న ఇమ్లీబన్, జూబ్లీ బస్ స్టేషన్ల మాదిరిగానే నగరం చుట్టూ మరికొన్ని బస్ టర్మినల్స్ కూడా నిర్మించాలని చెప్పారు. పార్కింగ్ కష్టాలను తొలగించేందుకు చేపట్టిన బహుళ అంతస్థుల పార్కింగ్ వ్యవస్థల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని చెప్పారు. మెట్రో రైలు పనులు జరిగే రహదారులను పట్టించుకోవడం లేదని, అక్కడ కూడా రహదారులను ఎప్పటికప్పుడు తీర్చిదిద్దాలని, అవసరమైన మరమ్మతులు చేయాలని సిఎం చెప్పారు. మెట్రో రైలు మార్గం నిర్మాణ ప్రణాళిక కూడా అస్తవ్యస్తంగా రూపొందించారని, కనీసం విమానాశ్రయానికి కూడా మెట్రో రైలు వెళ్లదని సిఎం అన్నారు. రెండో దశ మెట్రో రైలు నిర్మాణం ప్రజల అవసరాలను తీర్చే విధంగా ఉండాలని చెప్పారు. ట్రాఫిక్ సమస్యలు తీర్చడానికి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడానికి నిర్మిస్తున్న మెట్రో రైలు ట్రాఫిక్ సమస్యలు సృష్టించకుండా చూడాలని, స్టేషన్ల వద్ద దిగిన ప్యాసింజర్లు సులభంగా గమ్యస్థానం చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మెట్రోరైలు స్టేషన్ల వద్ద ప్రత్యేక పార్కింగ్ స్థలాలు సిద్దం చేయాలని సూచించారు. రోడ్ల మరమ్మతులు, పునర్నిర్మాణం సందర్భంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, వేసిన రోడ్లపైనే మళ్లీ డాంబర్, కంకర, సిమెంటు వేయడం వల్ల రోడ్ల ఎత్తు పెరిగి, ఇండ్లు కిందకి అవుతున్నాయన్నారు. రోడ్లను తవ్వి కొత్త రోడ్డు వేయాలని సూచించారు. రోడ్ల నిర్మాణంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక కొత్త పద్దతులు వచ్చాయని, ఏండ్ల తరబడి మన్నికగా ఉండే విధానం అవలంభించాలని చెప్పారు.
హైదరాబాద్ నగరంలోని రహదారులను మెరుగుపరిచే ప్రణాళికలో తాము కూడా భాగస్వామ్యం అవుతామని సిమెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ప్రభుత్వ విధానానికి లోబడి అవసరమైన పెట్టుబడులు పెడతామని అసోసియేషన్ ప్రతినిధులు చెప్పారు.
ప్రస్తుతం హైదరాబాద్ నగర రోడ్ల పరిస్థితిని, ట్రాఫిక్ జామ్ లను చూసి రాష్ట్రంలోని ఇతర నగరాలు జాగ్రత్త పడాలని సిఎం చెప్పారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ తదితర నగరాలు కూడా బాగా విస్తరిస్తాయి కాబట్టి, అక్కడ భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా రహదారుల వ్యవస్థను మెరుగు పరచాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.