
తిరుమల, 2021 ఫిబ్రవరి 11: తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలు శుక్రవారం సాయంత్రం శ్రీ పురందరదాసులవారి కీర్తనలతో మారుమోగాయి. శ్రీ పురందరదాసులవారి ఆరాధన మహోత్సవాలు గురువారం రెండో రోజుకు చేరుకున్నాయి. ముందుగా శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేపు చేశారు. ఈ సందర్భంగా చల్లటి సాయంత్రం వేళ నిర్వహించిన ఊంజల్సేవలో దాస సంకీర్తనల గానం భక్తులను మైమరపింపచేసింది.
టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో దాస భక్తులు సామూహికంగా పురందరదాస కృతులను ఆలపించారు. ఇందులో గురుపురందర దాసరే…., లక్ష్మి బారో…, నంద నందన బారో…, నారాయణ గోవింద జయ జయ…., హరినారాయణ…. చివరిగా నరసింహ స్వామి వారి కీర్తనలు భక్తి సాగరంలో ముంచెత్తాయి.
అనంతరం ఉడిపికి చెందిన పుత్తిగే మఠాధిపతి శ్రీశ్రీశ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ మంగళాశాసనాలు అందిస్తూ పురందరదాస కీర్తనలు భక్తిని విశేషంగా వ్యాప్తి చేస్తున్నాయని తెలిపారు. భగవంతుని నామసంకీర్తన కలియుగంలో అత్యంత ఉత్క ష్టమైన భక్తి మార్గమని చాటి చెప్పారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామివారి తత్త్వన్ని, వైభవాన్ని, వేంకటాచల మహత్యాన్ని స్వామిజీలు భక్తులకు విశదీకరించారు.
తరువాత టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి, అదనపు ఈవో ఏ.వి. ధర్మారెడ్డి, సి వి ఎస్ వో గోపీనాథ్ జెట్టిని సన్మానించి స్వామివారు ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి పి ఆర్ ఆనంద తీర్థచార్యులు, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, విజివో బాలిరెడ్డి, ఇతర అధికారులు, భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.
భగవన్నామస్మరణతో కష్టాలు దూరం : శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీశతీర్థ స్వామీజీ
భగవన్నామస్మరణతో ఎంతటి కష్టమైనా దూరం అవుతుందని బెంగుళూరు వ్యాసరాజమఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీశతీర్థ స్వామీజీ ఉద్ఘాటించారు. శ్రీ పురందరదాసుల ఆరాధన మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన గురువారం తిరుమలలోని ఆస్థాన మండపంలో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీశతీర్థ స్వామీజీ మంగళాశాసనాలు అందిస్తూ కలియుగంలో భగవంతుని నామసంకీర్తనమే ముక్తికి మార్గమని పేర్కొన్నారు. పురందరదాసుల వారు తన జీవితాన్ని దాస కీర్తనల రచనకే అంకితం చేశారని చెప్పారు. దాస పదాల ద్వారా అందరికీ అర్థమయ్యేలా సులువుగా భగవంతుని తత్వాన్ని, శరణాగతి విధానాన్ని, ధర్మాన్ని, నైతిక విలువలను తెలియజేశారని వివరించారు.
అనంతరం ఉడిపిలోని పాలిమారు మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాధీశతీర్థ స్వామీజీ మంగళాశాసనాలు అందిస్తూ పురందరదాస కీర్తనలు భక్తిని విశేషంగా వ్యాప్తి చేస్తున్నాయని తెలిపారు. భగవంతుని నామసంకీర్తన కలియుగంలో అత్యంత ఉత్కృష్టమైన భక్తి మార్గమని పురందరదాసులు చాటి చెప్పారన్నారు. పురందరదాసులవారు అమితమైన భక్తితో స్వామివారిపై అనేక కీర్తనలు రచించారని తెలియజేశారు.
అంతకుముందు దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి ఆర్ ఆనంద తీర్థచార్యులు ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగర సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 300 మంది భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.
శ్రీ పురందరదాస విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి
దాససాహిత్య పితామహుడు శ్రీ పురందరదాస ఆరాధనా మహోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 6.00 గంటలకు అలిపిరి వద్ద గల శ్రీ పురందరదాసుల విగ్రహనికి పుష్పాంజలి ఘటించారు.
హరిదాస రంజని :
అన్నమాచార్య కళామందింలో దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలోని భజనమండళ్ల సభ్యుల హరిదాస రంజని కార్యక్రమం గురువారం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగింది. ఇందులో దాససాహిత్య కళాకారులతో సామూహిక సంకీర్తన, ప్రముఖ పండితులతో ధార్మిక ఉపన్యాసాలు, పురందరదాస సంకీర్తన – విభావరి నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి పి.ఆర్.ఆనందతీర్థాచార్యులు, ఇతర ఆధికారులు, భక్తులు పాల్గొన్నారు.