జర్నలిస్టులను దూషిస్తూ భావప్రకటన స్వేచ్ఛను కాలరాసే అధికారం ఎమ్యెల్యేలకు ఎవరిచ్చారని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ ప్రశ్నించారు. వార్త విలేకరి సంతోష్ నాయక్ పై ఎమ్యెల్యే మహిపాల్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు , బెదిరింపులకు నిరసనగా గురువారం పటాన్ చెరువు లోని తొమ్మిదో నెంబర్ జాతీయ రహదారిపై టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమానికి హాజరైన సందర్భంగా విరాహత్ అలీ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించి మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభంగా ఉన్న మీడియా పట్ల చట్ట సభ ప్రతినిధులు కొందరు వ్యవరిస్తున్న తీరు సహించారనిదన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నామనే విషయాన్ని మరచి వాస్తవాలు వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టుల పట్ల అసహనాన్ని ప్రదర్శించడం విచారకరమన్నారు. నారాయణ్ ఖేడ్ ఎమ్యెల్యే భూపాల్ రెడ్డి, దుబ్బాక ఎమ్యెల్యే రఘునందన్ రావు, మల్కాజిగిరి ఎమ్యెల్యే మైనంపల్లి హన్మంతరావు, తాజాగా పటాన్ చెరువు ఎమ్యెల్యే మహిపాల్ రెడ్డిలు జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలు, హెచ్చరికలు రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా ఉన్నాయని విరాహత్ అలీ ధ్వజమెత్తారు. రాజ్యాంగేతర శక్తులు ఏ స్థాయిలో వున్నా వారికి తగినరీతిలో గుణపాఠం చెప్పిన చరిత్ర తెలంగాణ జర్నలిస్టులకు ఉందనే సత్యాన్ని రాజకీయులు మరచిపోరాదని ఆయన సూచించారు. జర్నలిస్టులు అవస్తవాలు రాస్తే వాటిని ఖండించుకునే హక్కు ఉంటుంది తప్పా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దౌర్జన్యంగా ప్రవర్తించే హక్కు ఎవరికి లేదన్నారు. 2001లో పటాన్ చెరువు ఎంపిపి అధ్యక్షుడిగా కొనసాగిన మహిపాల్ రెడ్డి తన సోదరుడు మధుసూదన్ రెడ్డి ద్వారా అప్పటి వార్త విలేకరి శంకర్ రావుపై దాడి చేయించగా నాటి ఏపీయూడబ్ల్యూజే అతనికి తగిన బుద్ధి చెప్పిందని విరాహత్ గుర్తుచేశారు. తన వ్యాఖ్యలతో జర్నలిస్టు లోకాన్ని అవమానపర్చిన మహిపాల్ రెడ్డి బేషరత్తుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
అరెస్టులో జాప్యమెందుకు?
రెండు రోజుల క్రితమే అమీన్ పూర్ పోలీస్టేషన్లో అట్రాసిటీ కేసు నమోదైన ఎమ్యెల్యే మహిపాల్ రెడ్డిని అరెస్టు చేయడంలో జాప్యం చేయడం ఎందుకని? విరాహత్ పోలీసులను ప్రశ్నించారు. రాస్తారోకో అనంతరం జర్నలిస్టులతో కలిసి ఆయన పటాన్ చెరువు డిఎస్పీ భీంరెడ్డిని కలిసి మాట్లాడారు. సామాన్య పౌరులకు ఓ చట్టం, అమాత్యులకు ప్రత్యేక చట్టం ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఫైసల్ అహ్మద్, కార్యవర్గ సభ్యులు ఏ.రాజేష్, డి.జి.శ్రీనివాస్ శర్మ, యూనియన్ రాష్ట్ర దాడుల వ్యతిరేక కమిటీ సభ్యుడు మిన్పూర్ శ్రీనివాస్, మెదక్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అధ్యక్షులు శంకర్ దయాల్ చారీ, కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, మోతె వెంకట్ రెడ్డి, వార్త జిల్లా ప్రతినిధి వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు