– నెల్లూరులో గుడికో గోమాత ప్రారంభం
– సి ఎం ఆదేశంతో పెద్ద ఎత్తున హిందూ ధార్మిక ప్రచార కార్యక్రమాలు: టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
నెల్లూరు 16 ఫిబ్రవరి 2021: బిడ్డల పెళ్ళిళ్ళ వల్ల పేద కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే సంకల్పంతో టీటీడీ ఆధ్వర్యంలో త్వరలో దేశ వ్యాప్తంగా సామూహిక వివాహాలు ( కళ్యాణ మస్తు) నిర్వహించబోతున్నామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.
మంగళవారం సాయంత్రం నెల్లూరు లోని ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో గుడికి గోమాత కార్యక్రమాన్ని చైర్మన్ ప్రారంభించారు. టీటీడీ పాలకమండలి సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఐదు ఆలయాలకు దానంగా ఇచ్చిన గోవులు, దూడలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం చైర్మన్ దంపతుల చేతుల మీదుగా వీటిని ఐదు ఆలయాలకు అందించారు.
ఈ సందర్భంగా చైర్మన్ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. సి ఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు టీటీడీ దేశవ్యాప్తంగా అనేక హిందూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా పవిత్ర కార్తీక మాసంలో గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం అమలు జరుగుతోందన్నారు. గోవును పూజిస్తే ముక్కోటి దేవతలను పూజయించినట్లే నని పురాణాలు చెబుతున్నాయన్నారు.దీనివల్ల దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉంటాయని ఆయన చెప్పారు. కళ్యాణ మస్తు ద్వారా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పాటు దేశంలోని ముఖ్య నగరాలు, పట్టణాల్లో ఉచిత వివాహాలు నిర్వహించాలని సంకల్పించామన్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని బిసి, ఎస్సి, ఎస్టి కాలనీల్లో 500 ఆలయాలు నిర్మించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగీకరించారన్నారు. కోవిడ్ వల్ల ఆలస్యమైన ఈ పనులు త్వరలో ప్రారంభిస్తామని వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు.
ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.