
తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి నవలా రచన పోటీలను నిర్వహించనున్నట్లు సాహిత్య అకాడమి చైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు. మంగళవారం సాహిత్య అకాడమి కార్యాలయంలో నందిని సిధారెడ్డి మాట్లాడుతూ… నేటి తరం సాహితీ ప్రియులలో పఠనాభిరుచిని, రచనాశక్తిని పెంపొందించడం కోసం, నవలా రచనలవైపు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ” తెలంగాణ రాష్ట్ర స్థాయి నవలా పోటీ” ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. బహుమతుల విషయంలో తుది నిర్ణయం తెలంగాణ సాహిత్య అకాడమిదే అని వివరించారు.
ఉత్తమ రచనలకు ప్రధమ బహుమతి రూ. 1,00,000 /-, ద్వితీయ బహుమతి రూ. 75,000 /-, తృతీయ బహుమతి రూ. 50,000 /- , నగదు రూపంలో బహుమతులు అందజేస్తామని అన్నారు.
ఈ క్రింద తెలియజేసిన నిబంధనలకు లోబడి రచయితలు తమ నవలను 10.10.2018 వరకు కార్యదర్శి, తెలంగాణ సాహిత్య అకాడమి, రవీంద్రభారతి, కళాభవన్, సైఫాబాద్, హైదరాబాద్ – 500004, చిరునామాకు పంపవలసిందిగా కోరారు.
నిబంధనలు:
1. పోటీకోసం పంపించే నవల ప్రచురణలో 100 పేజీలకు తగ్గకుండా, 200 పేజీలకు మించకుండా ఉండాలి.
2. నవల తెలంగాణ జనజీవితాన్ని ప్రతిబింబించే ఇతివృత్తాన్ని కలిగి ఉండాలి.
3. నవల ఇదివరకు ఎక్కడ ప్రచురణకాని, ప్రసారంకానీ అయివుండకూడదు. ఈ పోటీ కోసమే ప్రత్యేకంగా రాయబడిన రచన అయిఉండాలి .
4. అనువాదాలు, అనుసరణలు పోటీకి పనికిరావు.
5.’ ఇది తన మౌలిక రచన అని, అనువాదం కానీ, అనుసరణ కానీ కాదు ‘ అనే హామీపత్రం జతపరచాలి.
6. బహుమతుల విషయంలో తుది నిర్ణయం తెలంగాణ సాహిత్య అకాడమిదే.
7. రచయిత తమ పూర్తి వివరాలు, చిరునామా తెలియజేయాల్సి ఉంటుంది.
8. ఈ పోటీలో ఆశించిన స్థాయి నవల రాకపోయినట్లైతే ప్రకటించిన బహుమతులను ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది.
9. బహుమతి పొందిన నవలలను సాహిత్య అకాడమి ప్రచురిస్తుంది.