2018-19 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నిరంగాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమానికి ఉపయోగపడే విధంగా ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. పూర్తి సమతుల్యంగా బడ్జెట్ ప్రతిపాదించారని సిఎం అభినందించారు. తెలంగాణ రాష్ట్రానికున్న ఆదాయ వనరులను, అవసరాలు, ప్రభుత్వ లక్ష్యాలకు మధ్య పూర్తి సమన్వయం సాధిస్తూ బడ్జెట్ రూపొందించారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు సమర్ధంగా అమలు చేసే విధంగా వార్షిక ఆర్థిక ప్రణాళిక రూపొందించిన ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక శాఖ సలహాదారు జి.ఆర్.రెడ్డిని సిఎం అభినందించారు.
ఎక్కువ శాతం మంది ఆధారపడిన వ్యవసాయరంగానికి అత్యధిక నిధులు ప్రతిపాదించడం పట్ల ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టులు, పంట పెట్టుబడి మధ్ధతు పథకం, విద్యుత్ సబ్సిడీలకు ఎక్కువ నిధులు సమకూర్చడం వల్ల తెలంగాణలో వ్యవసాయ రంగాభివృధ్దికి ప్రభుత్వం చిత్తశుధ్దితో అమలు చేస్తున్న కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు సాగుతాయని సిఎం అన్నారు.