జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి మంజూరు చేసే ఆర్థిక సహాయానికి అర్హులైన జర్నలిస్టు కుటుంబాలకు డిసెంబర్ 27వ తేదీన చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి మంజూరు చేసే ఆర్థిక సహాయం పొందడానికి అర్హులైన జర్నలిస్టులు తమ దరఖాస్తులను డిసెంబర్ 24వ తేదీ వరకు మీడియా అకాడమీ కార్యాలయంలో సమర్పించాలని చైర్మన్ తెలిపారు.
2014, జూన్ 2 తర్వాత మరణించిన జర్నలిస్టులకు సంబంధించిన కుటుంబ సభ్యులు, జర్నలిస్టు వృత్తిలో ఉంటూ అనారోగ్యం బారిన పడి పనిచేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులు మాత్రమే ఈ ఆర్థిక సహాయానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి లబ్ధి పొందిన వారు, ఇప్పటికే మీడియా అకాడమీకి దరఖాస్తులు పంపినవారు మళ్లీ దరఖాస్తు చేయవలసిన అవసరం లేదని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత పౌర సంబంధాల అధికారులైన ఉప సంచాలకులు, సహాయ సంచాలకులు, డీపీఆర్వోల ద్వారా ధ్రువీకరించిన దరఖాస్తులను మీడియా అకాడమీ కార్యాలయానికి పంపించాలన్నారు. దరఖాస్తులను కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, హైదరాబాద్ చిరునామా: ఇంటి నెం.10-2-1, సమాచార భవన్, 2వ అంతస్తు, ఎ.సి. గార్డ్స్, మాసాబ్ ట్యాంక్, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ కాంప్లెక్స్, హైదరాబాదుకు పంపవలసిందిగా ఆయన తెలియజేశారు. ఇతర వివరాలకు కార్యాలయ ఫోన్ నంబర్ 040-23298672, 23298674లను సంప్రదించాలన్నారు.