శ్రీశైల దేవస్థానం: సాధారణ సమీక్షలో భాగంగా ఈ రోజు శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకస్మికంగా విరాళాల సేకరణ కేంద్రం, మాడవీధులు, ఆలయ దక్షిణద్వారం (గేట్ నెం.2) మొదలైన వాటిని పరిశీలించారు. కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ కుటీరనిర్మాణ పథకం, గోసంరక్షణ, శాశ్వత అన్నదానం మొదలైన దేవస్థాన విరాళాల పథకాల పట్ల భక్తులకు మరింతగా అవగాహన కలిగించాలని విరాళాల సేకరణ విభాగాన్ని ఆదేశించారు. విరాళాల సేకరణ కేంద్ర ప్రాంగణములో దేవస్థానం పథకాలను వివరించే మరిన్ని ఫ్లెక్సీబోర్డులను వీలైనంత ఎక్కువగా ఏర్పాటు చేయాలన్నారు.తరువాత దర్శన ప్రవేశద్వారాలు, క్యూలైన్లు, ఆలయ మాడవీధులు మొదలైన వాటిని పరిశీలించారు.ముఖ్యంగా దర్శనప్రవేశంద్వారం వద్ద మరియు ఆర్జితసేవల ప్రవేశద్వారం వద్ద థర్మల్ గన్ ద్వారా శరీర ఉష్ణోగ్రతలను తప్పనిసరిగా పరీక్షించాలన్నారు. కోవిడ్ నివారణకుగాను ముఖానికి మాస్కును ధరించడం, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరుచుకోవడం, భౌతికదూరాన్ని పాటించడంపట్ల భక్తులకు అవగాహన కల్పించాలని భద్రతా సిబ్బందిని ఆదేశించారు.
ఆలయ ప్రసారవ్యవస్థ ద్వారా (మైక్ ద్వారా) నిరంతరం సూచనలు చేస్తూ, భక్తులకు అవగాహన కల్పించేందుకు తగు చర్యలు చేపట్టాలని శ్రీశైలప్రభవిభాగాన్ని కార్యనిర్వహణాధికారి ఆదేశించారు.ముఖ్యంగా అన్నీ క్యూలైన్లను ఎప్పటికప్పుడు విధిగా క్రిమిసంహారకాలతో పిచికారి చేస్తుండాలన్నారు.సెల్ ఫోన్లు మొదలైన వాటిని ఎట్టిపరిస్థితులలోనూ ఆలయములోకి అనుమతించకూడదని కూడా భద్రతా సిబ్బందిని ఆదేశించారు. ఎవరైనా భక్తులు ప్రవేశద్వారం వద్ద సెల్ ఫోన్లతో వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా వారికి ఆలయ నిభందనలను తెలియజెప్పి, సెల్ ఫోన్లను వెలుపల భద్రపరుచుకోవలసినదిగా సూచించాలన్నారు. ఆలయములోనికి బ్యాగులను అనుమతించకూడదని, ఎవరైనా బ్యాగులను కలిగి ఉన్నప్పుడు ప్రవేశద్వారంవద్దనే వాటిని తనిఖీ చేయాలన్నారు.భద్రతా చర్యలలో భాగంగా ప్రవేశద్వారాల వద్ద మెటల్ డిటెక్టర్తో తప్పనిసరిగా తనిఖీలు చేపట్టాలని కూడా భద్రతా సిబ్బందిని ఆదేశించారు.ఈ పరిశీలనలో భద్రతా అధికారిగా విధులు నిర్వహిస్తున్న పర్యవేక్షకులు శ్రీహరి, విరాళాల సేకరణ పర్యవేక్షకులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.