మహబూబ్ నగర్ : బీ జేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఎన్నికల శంఖారావం పూరించారు . మహబూబ్ నగర్ లో శనివారం సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు . తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ను ఆయన విమర్శించారు . ఈ సారి కేటీ ఆర్ ను సీ ఎం చేస్తారా లేక దళితుడిని చేస్తారా అని అమిత్ షా ప్రశ్నించారు. జమిలి ఎన్నికలకు కేసీఆర్ అమోదం తెలిపి మాట తప్పారన్నారు. ఓవైసి కి భయపడి సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు.
కేసీఆర్పై అమిత్ షా గరం గరం:
హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్పై కమల దళపతి అమిత్ షా నిప్పులు చెరిగారు. కేసీఆర్ విధానాలను తూర్పారబట్టారు. తెలంగాణలో పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. తన కుటుంబం కోసమే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని విమర్శించారు. 2014లో తెలంగాణకు దళితుడిని సీఎంను చేస్తామని ఇచ్చిన హామీని విస్మరించారని దుయ్యబట్టారు. కనీసం 2018లోనైనా దళితుడిని సీఎంగా ప్రకటిస్తారో లేదో స్పష్టంగా చెప్పాలన్నారు. కుటుంబ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం అని అమిత్ షా స్పష్టం చేశారు. కేసీఆర్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఎంఐఎం చెప్పిన మాట తూచా తప్పకుండా పాటిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను మళ్లీ రజాకార్ల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అవకాశవాద రాజకీయాలే ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం హయాంలో దేశంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాయని, ఆయా రాష్ట్రాల ఏర్పాటు తర్వాత రాష్ట్రాలన్నీ కలిసి అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని అన్నారు. కానీ ఏపీ, తెలంగాణలో పూర్తివిరుద్ధంగా జరుగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ , నాడు సీఎం అంజయ్య, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పట్ల ఎలా వ్యవహరించిందో తెలుగు ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ఇదే సమయంలో తాము వాజ్పేయి పట్ల ఎంత గౌరవంగా వ్యవహరించామో ప్రజలందరూ చూశారన్నారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ సర్కారు కట్టుబడి ఉందన్నారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎవరితోనూ పొత్తులుండవని స్పష్టం చేశారు.