ఆర్థిక వ్యవస్థను అతికొద్ది రోజుల్లో గాడిలోకి తెస్తాం-మంత్రి  పొంగులేటి

ఖమ్మం, డిసెంబర్ 18: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ  మంత్రి  పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో పాలేరు నియోజకవర్గ అభివృద్ధి పనులపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, ప్రజలు ఆశించిన ఆశయాల మేరకు, వారి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయబోమని అన్నారు. ప్రతి అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు. అధికారులు తమ తమ శాఖలకు సంబంధించి ఖచ్చితమైన లెక్కలు ఇవ్వాలన్నారు. సమీక్షలో పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ, ఇర్రిగేషన్, రోడ్లు భవనాలు, డబల్ బెడ్ రూమ్, వైద్యం, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ శాఖల పనులపై సమీక్ష చేశారు.

మిషన్ భగీరథ ద్వారా క్షేత్ర స్థాయిలో ఎంత మంది ప్రజలు, ఎన్ని గృహాలకు త్రాగునీటి సరఫరా చేస్తున్నది నివేదిక సమర్పించాలన్నారు మంత్రి . విద్యుత్ ఎన్ని గంటలు ఇస్తున్నది తెలుపాలన్నారు. జెఎన్టియు ఇంజనీరింగ్ కళాశాలకు స్థల కేటాయింపు, ఫ్యాకల్టీ, పూర్తి స్థాయిలో కళాశాల నడిచేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. నేషనల్ హైవే ద్వారా చేపడుతున్న ప్రాజెక్టుల పురోగతి, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పాలేరు నియోజకవర్గ పరిధిలో పంచాయతీ రాజ్ కు సంబంధించి 2 సబ్ డివిజన్లు ఉన్నట్లు, 143 గ్రామ పంచాయతీలు ఉండగా, 95 గ్రామ పంచాయతీలకు స్వంత భవనాలు ఉండగా, 43 భవనాలు ఇజిఎస్ క్రింద మంజూరయి పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. మిగిలిన 5 గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణానికి ఇజిఎస్ క్రింద ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. సీతారామ ప్రాజెక్టు క్రింద 2 ప్యాకేజీల పనులు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. అవసరం లేని చోట భూసేకరణలు చేసిన దగ్గర అవసరాలకు పనికివచ్చే భూములను చుట్టుపక్కల గ్రామాల నిరుపేదలకు పంపిణీకి చర్యలు తీసుకోవాలని అన్నారు. మున్నేరు వాగు నుండి లిఫ్ట్ లేకుండా, గ్రావిటీ తో సీతారామ ప్రాజెక్టుకు నీరు వెళుతుందా, ప్రణాళిక చేయాలన్నారు. పాలేరు లింక్ కెనాల్ కు సంబంధించి, భూసేకరణకు, రైతులతో మాట్లాడతానని, పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు చేపట్టాలని అన్నారు. రోడ్లు, భవనాల శాఖ ద్వారా నియోజకవర్గ పరిధిలో 5 కాలనీల్లో 97 గృహ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నట్లు, 2 కాలనీల్లో సంక్రాంతి లోగా పూర్తయే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటికి కేటాయించిన డబల్ బెడ్ రూం ఇండ్లు, గ్రామ సభ ద్వారా, లాటరీ ద్వారా, ఏ ప్రాతిపదికన కేటాయించింది నివేదిక సమర్పించాలన్నారు. తహశీల్దార్లు ఇప్పటికి జారీచేసిన పొజిషన్ సర్టిఫికెట్లు, పాస్ బుక్ లు పునః పరిశీలించి తప్పులు జరిగితే సరిదిద్దాలన్నారు.

అన్యాక్రాంతం అయిన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని, రక్షణ చర్యలు చేపట్టాలన్నారు మంత్రి. . ఆర్డీవోలు ఈ  విషయాల్లో పర్యవేక్షణ చేయాలన్నారు.  ఆర్థిక వ్యవస్థను అతికొద్ది రోజుల్లో గాడిలోకి తెస్తామని, వేతనాలు 1-5వ తేదీలోగా ఇచ్చేలా చర్యలు చేపడతామని అన్నారు. ప్రారంభమయి 50 శాతానికి పైగా పురోగతిలో ఉన్న పనులను పూర్తి చేయాలని, మంజూరయిన పనులు పునః సమీక్షించి, ప్రాధాన్యత ప్రకారంగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. కుటుంబ సభ్యులుగా కలిసి పనిచేస్తామని, ప్రభుత్వం మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోమని, రెవిన్యూ, భూ, అనేక సెక్టార్లలో సంస్కరణలు తెస్తామని, అందరం కలిసి ప్రజలకు మంచి చేసినదే నిజమైన పరిపాలన అని మంత్రి తెలిపారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.