శ్రీశైల దేవస్థానం:శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి సోమవారం ఈ ఆలయానికి విచ్చేసి శ్రీ స్వామిఅమ్మవార్లను సేవించారు.
ఈ ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న పీఠాధిపతి వారికి సంప్రదాయాన్ని అనుసరించి రాజగోపురం వద్ద కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు చిట్టిబొట్ల భరద్వాజశర్మ, అర్చకస్వాములు, వేదపండితలు, ఆలయ విభాగం అధికారులు సంప్రదాయబద్దంగా పూర్ణకుంభంతో స్వాగతంపలికారు. అనంతరం వారు శ్రీ స్వామిఅమ్మవార్లను దర్శించుకుని పూజాదికాలను నిర్వహించారు.
తరువాత అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారి గౌరవార్థం వేదగోష్ఠి నిర్వహించారు.తరువాత గురువందన కార్యక్రమం జరిగింది. అనంతరం మహాస్వామివారు అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా వారు సనాతన ధర్మం విశిష్టత, శ్రీశైల క్షేత్ర మహిమా విశేషాలు, శివానందలహరి – సౌందర్యలహరి స్తోత్రాల విశేషాలను వివరించారు.
చివరగా మహాస్వామివారు భక్తులందరికీ ఆశీర్వచనాలను అందజేశారు.
