
శ్రీశైల దేవస్థానం:
- వ్రతములో పాల్గొనవారందరికీ చీర, రవికవస్త్రం, వృక్ష ప్రసాదం అందజేత
- వ్రతాన్ని జరిపించుకున్న వారందరికీ శ్రీస్వామిఅమ్మవార్ల దర్శనం , అన్న ప్రసాదాల ఏర్పాట్లు
వరలక్ష్మీవ్రత పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం దేవస్థానం ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించింది.
ఆలయ ఉత్తరద్వారం ఎదురుగా ఉన్న చంద్రవతి కల్యాణ మండపంలో ఈ ఉచిత సామూహిక వ్రతాలు నిర్వహించారు.
సుమారు 1600 మందికి పైగా భక్తులు ఈ వ్రతాన్ని జరిపించుకున్నారు.
ఈ వ్రతాలకు కావలసిన పూజాద్రవ్యాలన్నింటినీ దేవస్థానమే సమకూర్చింది. కార్యక్రమంలో ప్రతి ఒక్కరికోసం వేరువేరుగా కలశాలను నెలకొల్పి శాస్త్రోక్తంగా ఈ వ్రతం జరిపారు.
సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వ్రతంలో ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజ నిర్వహించారు. తరువాత వేదికపై వేంచేబు చేయించిన శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు జరిపారు.
అనంతరం వరలక్ష్మీవ్రతంలో భాగంగా భక్తులందరిచేత విడివిడిగా కలశస్థాపన చేయించి వరలక్ష్మీదేవివారిని సమంత్రకంగా ఆవాహన చేసారు . తరువాత శ్రీసూక్త విధానంలో వ్రతకల్పపూర్వకంగా వరలక్ష్మీదేవివారికి షోడశోపచారపూజలు జరిగాయి. అనంతరం అధ్యాపక (స్థానాచార్యులు) వ్రతకథను పఠించి వ్రత మహిమా విశేషాలను భక్తులకు తెలియజేశారు. చివరగా నీరాజన మంత్రపుష్పాలను జరిపి వ్రతసమాప్తి చేశారు.
వ్రతాన్ని జరిపించుకున్న వారందరికీ, చీర, రవికవస్త్రం, పూలు, గాజులు, కంకణాలు, వృక్షప్రసాదంగా తులసి, ఉసిరి మొక్కలు, పుస్తక ప్రసాదంగా శ్రీశైలప్రభ మాసపత్రిక, మూడు రకాల ప్రసాదాలు అందించారు.
భక్తులందరికీ ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పించారు. దర్శనానంతరం దేవస్థానం అన్నపూర్ణ భవనం లో భక్తులందరికీ అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు దంపతులు, డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఆర్. రమణమ్మ, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు, స్వామివార్ల ప్రధానార్చకులు హెచ్. వీరయ్యస్వామి, అమ్మవారి ప్రధానార్చకులు యం. ఉమానాగేశ్వర శాస్త్రి, సీనియర్ వేదపండితులు గంటి రాధకృష్ణ శర్మ, అధ్యాపక యం. పూర్ణానందం, పలువురు అర్చకస్వాములు, వేదపండితులు, పలు విభాగాల పర్యవేక్షకులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ మన వైదిక సంప్రదాయంలో శ్రావణ మాసాన వరలక్ష్మీవ్రతాన్ని ఆచరించడం సంప్రదాయంగా వస్తున్నదని అన్నారు. ఈ శ్రావణమాసం సర్వదేవతా ప్రీతికరంగా చెప్పబడుతోందన్నారు. ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా దేవస్థానం ఈ వరలక్ష్మీవ్రతాలను నిర్వహించినట్లు తెలిపారు. ఈ సామూహిక వరలక్ష్మీ వ్రతంలో అధికసంఖ్యలో పాల్గొనడం ఎంతో విషయమన్నారు. జ్యోతిర్లింగస్వరూపుడైన శ్రీమల్లికార్జునస్వామివారు మహాశక్తి స్వరూపిణి శ్రీభ్రమరాంబాదేవివారు స్వయంవ్యక్తంగా వెలసిన శ్రీశైలమహాక్షేత్రంలో వరలక్ష్మీవ్రతాన్ని జరిపించుకునే వారందరు కూడా ఎంతో అదృష్టవంతులన్నారు. అందరికీ శ్రేయస్సు కలుగుతుందన్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో చేసే ఏ పుణ్యకార్యమైన వెయ్యింతల ఫలితాన్నిస్తుందని పురాణాలు చెబుతున్నాయన్నారు.
భక్తులందరూ వ్రతక్రియను సౌకర్యవంతంగా వీక్షించేందుకు వీలుగా చంద్రవతి కల్యాణ మండపంలో ప్రత్యేకంగా ఎల్.ఈ.డి స్క్రీనును కూడా ఏర్పాటు చేశారు.