
శ్రీశైల దేవస్థానం:ఉగాది మహోత్సవాలలో భాగంగా చివరి రోజు బుధవారం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. తరువాత యాగశాల లో శ్రీచండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు చేసారు. తరువాత నిత్యహోమ బలిహరణలను చేసి రుద్రహోమాన్ని, జయాదిహోమాన్ని జరిపారు. అమ్మవారి ఆలయ యాగశాలలో చండీ హోమం జరిపారు.తరువాత యాగ పూర్ణాహుతి, వసంతోత్సవం, అవబృథం కార్యక్రమాలు చేసారు.
పూర్ణాహుతి :
పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సుగంధ ద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగ కార్యక్రమాన్ని పూర్తి చేసారు.
వసంతోత్సవం :
పూర్ణాహుతి తరువాత వసంతోత్సవం జరిగింది. ఈ కార్యక్రమం లో ‘ స్థానాచార్యులు ( అధ్యాపక) వసంతాన్ని (పసుపు, సున్నం, సుగంధ ద్రవ్యాలు కలిపిన మంత్రపూరిత జలం సమంత్రకంగా భక్తులపై ప్రోక్షించారు.
అవభృథం – త్రిశూలస్నానం:
వసంతోత్సవం తరువాత చండీశ్వరస్వామివారికి మల్లికాగుండం వద్ద అవభృథం ఆ తరువాత త్రిశూలస్నానం కార్యక్రమాలు జరిపారు.
వసంతోత్సవం ముగిసిన వెంటనే చండీశ్వరస్వామివారిని ఆలయ ప్రాకార ప్రదక్షిణతో మల్లికాగుండం వద్దకు వద్దకు పల్లకీలో తోడ్కొనివచ్చారు.తరువాత చండీశ్వరస్వామికి అవభృథం నిర్వహించారు.
ఈ అవభృథంలో రుద్రాధ్యాయ మంత్రాలతో చండీశ్వరస్వామివారికి శుద్ధజలం, పంచా మృతాలు, భస్మోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, సుగంధోదకం, బిల్వోదకం, పుష్పోదకం, నారికేళోదకం మొదలైన వాటితో స్నపన కార్యక్రమం నిర్వహించారు
త్రిశూలస్నానం :
తరువాత మల్లికాగుండంలో త్రిశూలస్నాన కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమం లో చండీశ్వర స్వామివారికి మల్లికాగుండంలో పుణ్యస్నానం జరిపించారు.
త్రిశూలస్నానం జరిగే సమయం లో మల్లికాగుండ జలాన్ని తలపై ప్రోక్షించుకోవడం వలన
పాపాలన్ని నశించి శ్రేయస్సు కలుగుతుందని చెబుతారు.
ఈ కార్యక్రమాలలో కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు, అర్చకస్వాములు, వేదపండితులు, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సాయంకాలం శ్రీస్వామిఅమ్మవార్లకు అశ్వవాహనసేవ, అమ్మవారికి భ్రమరాంబాదేవి నిజాలంకరణ కార్యక్రమాలు జరిగాయి.
అశ్వవాహనసేవ:
వాహనసేవలో భాగంగా శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు.అశ్వవాహనాధీశులైన శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించడం వలన సమస్యలు తీరిపోతాయని, సంతానార్థులకు సంతానం కలుగుతుందని నమ్మకం.
నిజాలంకరణ:
ఉగాది మహోత్సవాలలో , అలంకారాలలో భాగంగా ఈ సాయంకాలం ఉత్సవ మూర్తిని భ్రమరాంబాదేవి నిజాలంకరణ స్వరూపంలో అలంకరింపజేసారు.అమ్మవారి అష్టభుజాలను కలిగిన ఈ దేవి శూలం, బాకు, గద, ఖడ్గం, విల్లు, డాలు, పరిఘ మొదలైన ఆయుధాలను ధరించి జగన్మాతగా దర్శనం ప్రత్యేకం.
అమ్మవారి నిజాలంకరణ దర్శనం వలన సమస్యలన్ని తొలగిపోయి, సకల శుభాలు కలుగుతాయని నమ్మకం.
కాగా పూజాదికాల తరువాతా ఆలయ ప్రాంగణములో ప్రదక్షణగా ఉత్సవమూర్తులకు ఆలయ ఉత్సవం జరిపారు.
ఈ సాయంకాలం ఆలయ ఉత్సవంతో ఉగాది ఉత్సవాలు పూర్తి అయ్యాయి.
సాంస్కృతిక కార్యక్రమాలు:
ఉగాది మహోత్సవాల సందర్భంగా భక్తులను అలరించేందుకు పలు ధార్మిక , సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.ఇందులో భాగంగా శ్రీ కృతి కూచిపూడి డ్యాన్సు అకాడమీ, తెనాలి వారు కూచిపూడి నృత్యప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.ఈ కార్యక్రమం లో గణపతి ప్రార్థన, నటరాజకౌత్వం, భో… శంభో, శివ శివ భవభవ, అదిగదిగో శ్రీశైలం తదితర గీతాలకు భార్గవి, పావని, గగన తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.