
శ్రీశైల దేవస్థానం:మార్చి 27 తేదీ నుంచి 31 తేదీ వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఐదు రోజులపాటు ఈ మహోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై కార్యనిర్వహణాధికారి శనివారం సన్నాహ కసమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో దేవస్థానం డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి, అర్చకస్వాములు, వేదపండితులు,
ఆధ్యాపక, (స్థానాచార్యులు) అన్ని శాఖల అధికారులు, పర్యవేక్షకులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
సమావేశ ప్రారంభంలో కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాస రావు మాట్లాడుతూ ఉగాది ఉత్సవాలకు కర్ణాటక
రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండే కాకుండా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుండి ముఖ్యంగా షోలాపూర్,
సాంగ్లీ తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా
అన్ని కోణాల నుండి తగు జాగ్రత్తలు తీసుకుంటూ, ఆయా ఏర్పాట్లన్నీ పూర్తి చేయవలసినదిగా సంబంధిత
అధికారులను ఆదేశించారు.
ఉగాది ఉత్సవాలు మార్చి 27 తేదీన ప్రారంభమవుతున్నప్పటికీ వారం రోజులు ముందుగానే భక్తులు
క్షేత్రానికి చేరుకునే అవకాశం ఉందని చెబుతూ, ఈ నెల 20 తేదీకంతా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని
సంబంధిత విభాగాలను ఆదేశించారు.
శ్రీస్వామిఅమ్మవార్ల కైంకర్యాలు:
ఉత్సవాలలో శ్రీస్వామిఅమ్మవార్లకు జరిగే ఆయా కైంకర్యాలన్నీ ఎలాంటి లోపం లేకుండా పరిపూర్ణంగా
జరగాలని ఆదేశించారు ఈ ఓ. అదేవిధంగా పూజాదికాలు అన్నీ నిర్దేశించబడిన సమాయానికంతా ప్రారంభించాలని
అన్నారు.
కాలిబాట మార్గములో ఏర్పాట్లు:
ఉత్సవాలకు కాలిబాట మార్గములో వెంకటాపురం, నాగలూటి, దామెర్లకుంట్ల, పెద్దచెరువు,
మరఠంబావి, భీమునికొలను, కైలాసద్వారం మీదుగా క్షేత్రానికి వస్తారని, కాలిబాట మార్గములో తగిన
సదుపాయాలను కల్పించాలని సంబంధిత విభాగాలను ఆదేశించారు. ముఖ్యంగా భక్తులకు మంచినీటిని
అందించడములో ప్రత్యేక శ్రద్ధ కనబర్పాలన్నారు.
మంచినీటి సరఫరా :
భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా నీటిసరఫరాకు అవసరమైన చర్యలు
చేపట్టేందుకు ప్రత్యేకమైన కార్యచరణ ప్రణాళికను రూపొందించి ఆ క్రమంలో చర్యలు తీసుకోవాలని
ఆదేశించారు.మహాశివరాత్రిలో వేసిన మంచినీటి కుళాయిలన్నింటిని కూడా ఉగాది ఉత్సవాలలో కూడా
వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
అదేవిధంగా సాక్షిగణపతి, హఠకేశ్వరం, శిఖరేశ్వరం మరియు కైలాద్వారంతో పాటు క్షేత్రంలో భక్తులు
బసచేసే పలు ప్రదేశాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంకా దర్శనం
క్యూలైన్లలో కూడా నిరంతరం మంచినీటి సరఫరా చేయాలన్నారు.కాగా కైలాసద్వారం వద్ద అదనపు సింటెక్స్ ట్యాంకులు ఏర్పాటు చేయాలన్నారు. కనీసం 8 ట్యాంకుల
ఏర్పాటు ఉండాలన్నారు. కైలాసద్వారం నుండి భీమునికొలను మార్గములో 1000 లీటర్ల సామర్థ్యం గల
ట్యాంకులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు . ఈ మార్గములో ఆరేడుచోట్ల ఈ ట్యాంకుల ఏర్పాట్లు
ఉండాలన్నారు.
దాతలకు సహకారం :
కాలిబాట మార్గంలోని నాగలూటి, పెచ్చెర్వు, కైలాసద్వారం మొదలైన చోట్ల, శ్రీశైలక్షేత్ర
పరిధిలో పలుచోట్ల భక్తులకు అన్నదానం చేసే దాతలకు దేవస్థానం నుండి అవసరమైన సహాయ
సహకారాలను అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉత్సవాలలో క్షేత్రపరిధిలో కూడా
పలుచోట్ల భక్తులు అన్నదానం చేస్తుంటారని, అన్నదాన బృందాలన్నింటికి దేవస్థానం తరుపున పూర్తి సహాయ
సహకారాలు అందించాలన్నారు. ముఖ్యంగా అన్నదాన ప్రాంతాలలో పైప్ పెండాల్స్, లైటింగు ఏర్పాటు,
మంచినీటి సరఫరా ఏర్పాటు ఉండాలన్నారు.
క్యూలైన్లలో ఏర్పాట్లు :
క్యూలైన్లలో వేచివున్న భక్తులకు నిరంతర మంచినీరు, అల్పాహారాన్ని అందజేసే ఏర్పాట్లు చేయాలని
అన్నదాన, ఆలయ మరియు క్యూల నిర్వహణ విభాగాలను కార్యనిర్వహణాధికారి ఆదేశించారు. క్యూకాంప్లెక్సు
మరియు క్యూలైన్లలో అదనపు ఫ్యాన్లను ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైనచోట్ల కూలర్ల ఏర్పాటు కూడా
ఉండాలన్నారు.
తాత్కాలిక వసతి :
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఏర్పాట్లు చేసినట్లుగానే భక్తులు సేద తీరేందుకు ఉగాది
మహోత్సవాలలో కూడా పలు చోట్ల షామియానాలు, పైప్పెండాల్స్ ( చలువ పందిర్లు) మొదలైనవి ఏర్పాటు
చేయాలని ఆదేశించారు ఈ ఓ.
శ్రీశైలంలోని పలు ఖాళీ ప్రదేశాలలో ముఖ్యంగా బసవవనం, బాలగణేశవనం, ఆలయ ఉత్తరభాగంలో
గల ఉద్యానవనం, ఆలయ దక్షిణభాగంలో గల ఉద్యానవనం, శివదీక్షా శిబిరాలు, హేమారెడ్డిమల్లమ్మ మందిర
ప్రాంతం మొదలైన చోట్ల చలువపందిర్లు ( పైప్ పెండాల్స్) ఏర్పాటు చేయాలన్నారు. గత సంవత్సరం కంటే
కూడా వీలైనంత ఎక్కువ విస్తీర్ణములో పెండాల్స్ ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
స్వచ్చందసేవకుల సహకారం:
భక్తులకు సేవలను అందించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన స్వచ్చందసేవకుల
సహకారాన్ని తీసుకోవాలన్నారు ఈ ఓ.ముఖ్యంగా ఆలయంలో క్యూలైన్ల నిర్వహణ, క్యూలైన్లలో అల్పాహారం, మంచినీటిని అందజేయడం,
అన్నదానం మొదలైన చోట్ల ఈ స్వచ్చంద సేవకుల సేవలు వినియోగించుకోవాలన్నారు.ఆలయంలో స్వచ్చంద సేవలను అందించే సేవకులకు నిర్జీత వేళలలో షిప్పులను నిర్ణయించి వీరికి తదనుగుణంగా తాత్కాలిక గుర్తింపు కార్డులను అందజేయాలన్నారు.
విద్యుద్దీకరణ :
భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలమంతటా పలు ఆరు బయలు ప్రదేశాలలో లైటింగ్ ఏర్పాట్లు
చేయాలన్నారు. దేవస్థానం అతిథిగృహాల ప్రాంగణం, ఉద్యానవనాలు, తాత్కాలిక వసతిప్రదేశాలు మొదలైన
చోట్ల వీలైనంత ఎక్కువ విస్తీర్ణంలో ఈ తాత్కాలిక లైటింగ్ను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను
ఆదేశించారు.
వైద్య ఆరోగ్య సేవలు :
లక్షలాదిసంఖ్యలో భక్తులు వస్తున్న కారణంగా అవసరానికి సరిపడ మేరకు దేవస్థానం వైద్యశాలలో
అవసరమైన మేరకు ఔషధాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.గుండెజబ్బులు మొదలైన వాటికి అవసరమైన అత్యవసరమైన మందులు, కాలినడకన వచ్చే భక్తులకు
బొబ్బల నుండి ఉపశమనం కల్పించేందుకు పూత మందులు (ఆయింట్మెంట్మందు) మొదలైన వాటితో
పాటు అవసరమైన సూది మందులను కూడా సిద్ధంగా ఉండేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు.ముఖ్యంగా క్షేత్రపరిధిలోనూ , కైలాసద్వారం మొదలైనచోట్ల జిల్లా వైద్యశాఖ సహకారముతో తాత్కాలిక వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు.
పారిశుద్ధ్యం :
పారిశుద్ధ్య నిర్వహణకుగాను మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల లాగానే కార్యాచరణ ప్రణాళిక
రూపొందించి ఆ దిశలో చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్య పనులకు గాను దేవస్థానం పారిశుద్ధ్య
సిబ్బందితో పాటు అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు ఈ ఓ.
ఎప్పటికప్పుడు చెత్తచెదారాలను తొలగించేందుకుగాను. అవసరమైన సంఖ్యలో ట్రాక్టర్లను
అందుబాటులో ఉంచుకోవాలన్నారు.క్షేత్రపరిధిలో పలుచోట్ల గల శాశ్వత మరుగుదొడ్లను భక్తులు వినియోగించుకునేందుకు వీలుగా
అందుబాటులో ఉంచాలన్నారు. వీటితో పాటు పలుచోట్ల తాత్కాలిక మరుగుదొడ్లను కూడా ఏర్పాటు
చేయాలన్నారు.
అదేవిధంగా స్వచ్చ శ్రీశైలంలో భాగంగా క్షేత్రపరిధిలో బహిరంగ మలమూత్ర విసర్జనను నిషేధించిన
విషయమై సూచికబోర్డుల ద్వారా భక్తులకు అవగాహన కల్పించాలన్నారు.
సూచిక బోర్డులు ;
భక్తులకు సమాచారాన్ని తెలియజేసేందుకు అవసరమైన అన్ని చోట్ల కూడా కన్నడ భాషలో విస్తృతంగా
సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు ఈ ఓ.
పుష్పాలంకరణ :
ఉత్సవాలలో ప్రత్యేకంగా పుష్పాలంకరణ చేయాలని ఉద్యా నవిభాగాన్ని ఆదేశించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు :
ఉత్సవాలలో భక్తులను అలరించేందుకు కన్నడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.
కన్నడ భక్తి సంగీత విభావరి కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతో పాటు కన్నడ ప్రవచనాలు, కన్నడ
భక్తినాటకాలు కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
సమాచార కేంద్రాల ఏర్పాట్లు :
ఉత్సవాలలో భక్తుల సౌకర్యార్థం నందిసర్కిల్, కల్యాణకట్ట, పాతాళగంగమెట్లమార్గం, సాక్షిగణపతి,
హేమారెడ్డి మల్లమ్మ మందిరం, యజ్ఞవాటిక, దేవస్థానం వైద్యశాల మొదలైన చోట్ల తాత్కాలిక సమాచార
కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమాచార కేంద్రాలలో కన్నడ ప్రాంతాల స్వచ్చంద సేవకులను
ఏర్పాటు చేసుకుని వారి సహకారంతో భక్తులకు తగు సమాచారాన్ని అందజేయాలన్నారు.