
శ్రీశైల దేవస్థానం:

క్షేత్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
• సామాన్య భక్తుల సౌకర్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి.
• ప్రతీ ఉద్యోగి కూడా భక్తులతో మర్యాదగా మెలగాలి.
• భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు.
• శివసేవకుల స్వచ్ఛంద సేవను విరివిగా వినియోగించుకోవాలి.
• అభివృద్ధిలో భాగంగా చేపట్టిన ఇంజనీరింగ్ పనులను సకాలంలో పూర్తి చేయాలి.
• నిర్మాణంలో పూర్తి నాణ్యతా ప్రమాణాలను పాటించాలి.
రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్
శ్రీశైలక్షేత్రంలో రోజురోజుకు పెరుగుతున్న భక్తులరద్దీకనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ అన్నారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యాల కల్పన, క్షేత్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలను సమీక్షించి పలు ఆదేశాలు ఇచ్చారు.
కమిషనర్ ఈ రోజు శ్రీశైల క్షేత్రానికి విచ్చేసి దేవస్థాన అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. అదేవిధంగా ఈ సాయంకాలం పరిపాలనా కార్యాలయ భవనంలోని సమావేశ మందిరంలో అన్ని విభాగాల అధిపతులు , పర్యవేక్షకులతో సమావేశమై దేవస్థాన పరిపాలనా అంశాలను సమీక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికబద్దంగా చేపట్టాలన్నారు. ముఖ్యంగా సామాన్య భక్తులకు సదుపాయల కల్పనకు చేపట్టవలసిన అన్ని చర్యలను వెంటనే చేపట్టాలన్నారు.
సామాన్య భక్తుడికి అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఆలయ నిర్వహణ ఉండాలన్నారు. క్షేత్రానికి విచ్చేసే ప్రతీ భక్తుడు సంపూర్ణంగా తన యాత్ర ఫలవంతమైందనే తృప్తి కల్పించాల్సిన బాధ్యత దేవస్థానం సిబ్బంది, అధికారులపై ఉందన్నారు. భక్తుల మనోభావాలను, వారి విశ్వాసాలను గౌరవిస్తుండాలన్నారు.
ఈ ఉదయం ముందుగా దేవస్థానం అభివృద్ధి పనులను సమీక్షించారు. ఈ సమీక్షలో ఇటీవల పూర్తయిన పనులు, ప్రస్తుతం చేపట్టిన పనులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనుల గురించి అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తాత్కాలిక క్యూ కాంప్లెక్సు నిర్మాణానికి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. మూడు మాసాలలోగా నిర్మాణ ప్రక్రియ ప్రారంభమయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాబోవు 30 సంవత్సరాలలో పెరిగే రద్దీని దృష్టిలో ఉంచుకుని శాశ్వత క్యూ కాంప్లెక్సు నిర్మాణ ప్రణాళిక ఉండాలన్నారు.
అదేవిధంగా ఆలయ ముందు భాగంలో గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు గల ప్రధానవీధి సుందరీకరణకు, ప్రధానవీధిలో సాలు మండపాల నిర్మాణానికి సంబంధించి కొన్ని సూచనలు చేశారు. వాటి నిర్మాణం కోసం వెంటనే చర్యలను ప్రారంభించాలన్నారు.
సామాన్య భక్తులకు వసతి కల్పించేందుకు గణేశసదనం వద్ద మరో సత్రనిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఏటా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో విచ్చేసే శివదీక్షా భక్తుల సౌకర్యార్థం శివదీక్షా శిబిరాలలో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
అనంతరం ప్రధానాలయంలోని ప్రాచీన కట్టడాలను పరిశీలించారు. ఆలయంలోని నందిమండపం, వృద్ధమల్లికార్జునస్వామి ఆలయ ముఖమండపం, అమ్మవారి ఆలయ ప్రవేశద్వార మండపం పరిశీలించారు. అవసరమైతే వీటికి తగు మరమ్మతులు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రాచీన నిర్మాణశైలికి ఎలాంటి విఘాతం కలగకుండా ఈ మరమ్మతులు ఉండాలన్నారు.
అమ్మవారి ఆలయంలో ఉత్తరం వైపున నిర్మించతలపెట్టిన ప్రాకార మండపం పనులు త్వరితంగా పూర్తి చేయాలన్నారు.
ఆలయ మహాద్వారం ముందు ప్రస్తుతం ఉన్న రేకుల పైకప్పుస్థానంలో రాతి మండప నిర్మాణానికి ప్రతిపాదనలను రూపొందించాలన్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగాను , క్షేత్ర సుందరీకరణకు క్షేత్రంలో విస్తృతంగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. ముఖ్యంగా కదంబం, బిల్వం, రావి మొదలైన దేవతా వృక్షాలను అధికంగా నాటాలన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రధానమైన చోట్ల సుందరీకరణ మొక్కలను పెంచాలన్నారు. అదేవిధంగా అవకాశం ఉన్నచోట వర్టికల్ గార్డెన్లను ఏర్పాటు చేయాలన్నారు.
అనంతరం ఆయా పరిపాలనాంశాలను సమీక్షించారు.
ఈ సందర్భంగా ముందు దేవస్థాన జమాఖర్చులను పరిశీలించారు.
తరువాత దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాదవితరణ, గోసంరక్షణ,పరిపాలనా, ఆడిట్, అకౌంట్స్, ప్రసాదాలు, పారిశుద్ద్యం మొదలైన అంశాలను సమీక్షించారు.
భక్తుల సౌకర్యాల కల్పనలో భాగంగా శివసేవకుల స్వచ్ఛందసేవను విరివిగా వినియోగించు కోవాలన్నారు. స్వచ్ఛంద సేవకులు ఆలయంలో ఆయా సేవలు అందించేందుకు దేవస్థాన వెబ్సైట్ నందు నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయాన్ని మరింతగా విస్తృత పరచాలన్నారు. శివసేవకుల స్వచ్ఛంద సేవలను వినియోగించుకోవడం వలన భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించే వీలు కలుగుతుందన్నారు. ఆలయంలో క్యూలైన్ల నిర్వహణ, క్యూకాంప్లెక్సులో దర్శనం కోసం వేచి వున్న భక్తులకు మంచినీటి సరఫరా, అల్పాహార అందజేయుట, అన్నప్రసాదవితరణ మొదలైన చోట్ల శివసేవకుల సేవను వినియోగించుకోవాలన్నారు. స్వచ్ఛందసేవకు వచ్చే శివసేవకులకు శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుండాలన్నారు.
దేవస్థానంలో ప్రతి ఉద్యోగి కూడా నిబద్ధతతో , అంకితభావంతో విధులు నిర్వర్తించాలన్నారు. ఉద్యోగులు బాధ్యతాహితంగా విధులు నిర్వర్తిస్తూ జవాబుదారీతనాన్ని పెంపొందించుకోవాలన్నారు. పాలానపరంగా పూర్తి పారదర్శకతను కలిగి ఉండాలన్నారు.
భక్తులు ఆన్లైన్ బుకింగ్ సదుపాయాన్ని వినియోగించుకునేవిధంగా ప్రోత్సహించాలన్నారు.
అభివృద్ధి కార్యక్రమాల పరిశీలన , సమీక్షలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, దేవదాయశాఖ చీఫ్ ఇంజనీరు జి.వి.ఆర్. శేఖర్, దేవదాయశాఖ స్థపతి పి. పరమేశ్వరప్ప, దేవదాయశాఖ శిల్పవిభాగపు సలహదారు ఎస్. సుందర్రాజన్, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.
