శ్రీశైల దేవస్థానం:| మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో పదవ రోజు శుక్రవారం ఉదయం శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి. తరువాత శ్రీ స్వామివారి యాగశాల లో శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. రుద్రహోమం, చండీహోమం చేశారు.
తరువాత యాగ పూర్ణాహుతి, వసంతోత్సవం, అవబృథం, త్రిశూలస్నానం, కార్యక్రమాలు జరిగాయి
పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సుగంధ ద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
అనంతరం జరిగిన వసంతోత్సవంలో ఆలయ అర్చకులు, వేదపండితులు వసంతాన్ని (పసుపు, సున్నం కలిపిన మంత్ర పూరిత జలం) సమంత్రకంగా భక్తులపై ప్రోక్షించారు.
తరువాత జరిగిన అవబృథస్నానంలో చండీశ్వరస్వామికి ఆలయపుష్కరిణి వద్ద ఆగమశాస్త్రోక్తంగా కార్యక్రమం నిర్వహించారు. చివరగా త్రిశూలస్నాన కార్యక్రమం జరిగింది .
ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, అర్చకస్వాములు, అధ్యాపక ( స్థానాచార్యులు) వేదపండితులు తదితరులు పాల్గొన్నారు.
ధ్వజావరోహణ:
ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా సాయంకాలం ధ్వజావరోహణ కార్యక్రమం నిర్వహించారు.
ధ్వజావరోహణ కార్యక్రమంలో ఉత్సవాల మొదటిరోజున బ్రహ్మోత్సవ ప్రారంభ సూచకంగా ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై ఆవిష్కరింపజేసిన ధ్వజపటం అవరోహణ చేశారు.
:
మహాశివరాత్రిబ్రహ్మోత్సవాలలో భాగంగానే నిత్య కల్యాణ మండపంలో సదస్యం , నాగవల్లి కార్యక్రమాలు జరిపారు. సదస్యం కార్యక్రమంలో వేదపండితులు చతుర్వేద పారాయణలతో, స్తోత్రాలతో శ్రీస్వామిఅమ్మవార్లను స్తుతించారు.
ఆ తరువాత నాగవల్లికార్యక్రమంలో మహాశివరాత్రి రోజున కల్యాణోత్సవం జరిపించబడిన శ్రీ భ్రమరాంబాదేవి వారికి ఆగమశాస్త్రం సంప్రదాయం మేరకు మెట్టెలు,నల్లపూసలు సమర్పించారు .
శనివారంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలు:
ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగియనున్నాయి. ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా రేపు ఉదయం శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు వుంటాయి.. తరువాత సాయంకాలం శ్రీ స్వామివార్లకు అశ్వవాహనసేవ, ఆలయ ఉత్సవం నిర్వహిస్తారు. ఆలయ ఉత్సవం అనంతరం శ్రీస్వామిఅమ్మవార్లకు పుష్పోత్సవం, శయనోత్సవం
నిర్వహిస్తారు..