తిరుమల, 2021 మార్చి 25: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో రెండో రోజు గురువారం రాత్రి రుక్మిణీకృష్ణులు భక్తులకు అభయమిచ్చారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పుష్కరిణిలో తెప్పోత్సవాలు నిర్వహించారు.
ముందుగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణీకృష్ణుల ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. రెండో రోజు స్వామి, అమ్మవారు మూడు చుట్లు తిరిగి భక్తులను అనుగ్రహించారు. మంగళవాయిద్యం, వేదపండితుల వేదఘోష, అన్నమాచార్య ప్రాజెక్టు సంకీర్తనల మధ్య తెప్పోత్సవం కనువిందుగా జరిగింది.
ఈ కార్యక్రమంలో టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు డిపి.అనంత, సి.ప్రసాద్, సిఇ రమేష్రెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.