శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించిన డి. పెద్దిరాజు
శ్రీశైల దేవస్థానం:దేవస్థాన నూతన కార్యనిర్వహణాధికారిగా నియమితులైన డి. పెద్దిరాజు 25 న ఉదయం పరిపాలనా భవనం లో అధికార బాధ్యతలను స్వీకరించారు.పూర్వ కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న నుండి అధికార బాధ్యతలను స్వీకరించారు. ఉద్యోగ బాధ్యతల స్వీకరణకు ముందు డి. పెద్దిరాజు ఆలయం లో శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకుని పూజాదికాలను జరిపించుకున్నారు.
అధికార బాధ్యతలు స్వీకరించిన అనంతరం డి. పెద్దిరాజు మాట్లాడుతూ శ్రీస్వామిఅమ్మవార్ల అనుగ్రహంతో తనకు కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు నిర్వహించే అవకాశం లభించిందన్నారు. శ్రీస్వామిఅమ్మవార్లను సేవించుకునే భాగ్యం కలగడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.కార్యనిర్వహణాధికారి బాధ్యతల ద్వారా అటు స్వామిఅమ్మవార్లను, ఇటు భక్తులను సేవించుకునే అవకాశం తనకు లభించిందన్నారు.గతంలో తాము ద్వారక తిరుమల, శ్రీకాళహస్తి దేవస్థానాలలో కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వహించానన్నారు.ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ధర్మకర్తల మండలి, అర్చకస్వాములు, దేవస్థానం సిబ్బంది మొదలైన వారి సహకారముతో శ్రీశైలక్షేత్రాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.ముఖ్యంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.సనాతన ధర్మపరిరక్షణలో భాగంగా గో సంరక్షణ, దర్మప్రచారం మొదలైన కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు .పర్యావరణ పరిరక్షణకు ,క్షేత్ర సుందరీకరణలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు ఉంటాయన్నారు.
Post Comment