
శ్రీశైల దేవస్థానం:శ్రీశైలంలో ప్రారంభమైన ‘స్వచ్ఛత సేవా’ కార్యక్రమం,
కార్యక్రమములో భాగంగా అక్టోబరు 2వ తేదీ వరకు విస్తృత పారిశుద్ధ్య చర్యలు,
స్థానిక విద్యార్థులకు, సిబ్బందికి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు,
విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు,
క్షేత్ర పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమం
*ఆదివారం ‘ స్వచ్ఛత హీ సేవా’ కార్యక్రమములో భాగంగా క్షేత్ర పరిధిలో విస్తృత పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. అక్టోబరు 2వ తేదీ వరకు ఈ ‘ కార్యక్రమం కొనసాగుతుంది.అదేవిధంగా అక్టోబరు 2వ తేదీన ఈ కార్యక్రమ ముగింపు వేడుక వుంటుంది.
‘స్వభావ స్వచ్ఛత – సంస్కార స్వచ్ఛత’ ఇతివృత్తంతో ఈ కార్యక్రమము రాష్ట్ర దేవదాయశాఖ ఆదేశాల మేరకు చేపట్టారు .
ప్రధానాలయం ఎదురుగా గంగాధర మండపం వద్ద ఈ ఉదయం కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ అక్టోబరు 2వ తేదీ వరకు జరిగే ఈ ‘ స్వచ్ఛత హీ సేవా’ కార్యక్రమములో క్షేత్రపరిధిలో పలుచోట్ల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను vuntayannaru. ఇందుకు సంబంధించిన ప్రణాళికను రూపొందించామన్నారు.
ప్రధాన రహదారులు, పంచమఠాల ప్రాంగణాలు, పాతాళగంగమెట్ల మార్గం, అన్నప్రసాద వితరణ భవనము, దేవస్థానం గో సంరక్షణశాల, యజ్ఞవాటిక, గణేశ సదనం పరిసర ప్రాంతాలు దేవస్థానం సత్రాలు, యాత్రిక షెడ్లు, కాటేజీలు, సిబ్బంది వసతి గృహాల ప్రాంతం, వలయ రహదారి, సాక్షిగణపతి ఆలయ పరిసరాలు, హాటకేశ్వర ఆలయ పరిసరాలు, శిఖరేశ్వర ఆలయ పరిసరాలు, క్షేత్రపరిధిలోని ఉద్యానవనాలు మొదలైనచోట్ల ప్రత్యేకంగా పారిశుద్ధ్య చర్యలు వుంటాయన్నారు.
దేవస్థానం సిబ్బందికి, స్థానిక విద్యార్థులకు, శివసేవకులకు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామన్నారు.
విద్యార్థులకు స్థానిక వైద్యుల చేత పరిశుభ్రత ప్రాధాన్యంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
స్థానిక పాఠశాలల సహకారంతో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ , క్విజ్ పోటీలను నిర్వహిస్తామన్నారు. పోటీలో గెలుపొందిన విద్యార్థులకు అక్టోబరు 2వ తేదీన జరిగే ముగింపు కార్యక్రమములో దేవస్థానం తరుపున బహుమతులను అందజేస్తామని తెలిపారు ఈ ఓ. కార్యక్రమాన్ని పురస్కరించుకుని క్షేత్ర పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమం కూడా వుంటుందని తెలిపారు.
కాగా ఈ రోజు ఆలయ గంగాధర మండపం వద్ద జరిగిన ఈ ప్రారంభ కార్యక్రమములో డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి ఆర్. రమణమ్మ, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు వి. రామకృష్ణ, మురళీధరరెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి జి.స్వాములు, పలువురు విభాగాల పర్యవేక్షకులు, పారిశుద్ధ్యవిభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.అదేవిధంగా స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. ప్రసాదరావు కూడా ప్రారంభ కార్యక్రమములో పాల్గొన్నారు.