×

ఏపీలో సూపర్ సూపర్ ఆసుపత్రులు వస్తున్నాయి -వైయస్‌ జగన్‌

ఏపీలో సూపర్ సూపర్ ఆసుపత్రులు వస్తున్నాయి -వైయస్‌ జగన్‌

తాడేపల్లి: వైద్య రంగంలో ఏ పేదవాడికి ఇబ్బంది కలుగకూడదని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదవాడికి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 16 కొత్త మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. సోమవారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానం ద్వారా ఆదోని, నంద్యాల, పిడుగురాళ్ల, మచిలీపట్నం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుకొండ మెడికల్ కాలేజీలకు రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఏ రాష్ట్రానికి తీసిపోకుండా ఆరోగ్య రంగంలో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే పులివెందుల, పాడేరు లో మెడికల్‌ కాలేజీల పనులు జరుగుతున్నాయని, ఈ రోజు మరో 14 కొత్త మెడికల్‌ కళాశాలకు శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక టీచింగ్‌ కాలేజీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. కొత్త కాలేజీల నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ఆరోగ్యశ్రీలో గణనీయమైన మార్పులు తెచ్చామని, 2436 చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చామని సీఎం వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం కొత్తగా 14 మెడికల్‌ కాలేజీలకు సీఎం వైయస్‌ జగన్‌ వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడారు.

మనందరి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ..ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టగలుగుతున్నాం.

వైద్య రంగంలో ఏ పేదవాడికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు. ఏ పేదవాడైనా సరే కార్పొరేట్‌  ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే పరిస్థితి లేకపోవడం, మన వద్ద సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు  లేకపోయినా ఏరకంగా ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం. అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక మెడికల్‌ కాలేజీ, నర్సింగ్‌ ఆసుపత్రి, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేసి డాక్టర్లు అందుబాటులోకి తీసుకువచ్చే గొప్ప కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నాం.

రాష్ట్రం అవతరించిన కాలం నుంచి , బ్రిటిష్‌ కాలం నుంచి మన రాష్ట్రంలో కేవలం 11 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండేవి. ఈ రోజు రాష్ట్రంలో ఏకంగా 16 కొత్త మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయగలిగే పరిస్థితిలోకి వెళ్తున్నాం. ఇంత గొప్ప అవకాశం దేవుడిచ్చినందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.

ఈ రోజు కొత్తగా ఏర్పాటు చేసే మెడికల్‌ కాలేజీల్లో ఇప్పటికే పాడేరు, పులివెందులలో శంకుస్థాపన చేశాం. అక్కడ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ రోజు 14 కాలేజీలకు వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రానికి తీసిపోని విధంగా వైద్య రంగంలో మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని గర్వంగా చెప్పగలను. మన వద్ద పెద్ద పెద్ద నగరాలు లేవు, సూపర్‌ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు మన వద్ద లేవు. ఇలాంటి ఆసుపత్రులు మన వద్దకు రావాలంటే ఈ గొప్ప అడుగు ఉపయోగపడుతుంది. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం.

మూడేళ్లలో ఈ ఆసుపత్రులను పూర్తి చేసేలా రూ.100 కోట్లు ఎవరు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చినా కూడా ఒక్కొక్కరికి రెండెకరాలు భూమి ఉచితంగా ఇస్తుంది. కనీసం అంటే ప్రతి జిల్లాలో ఐదారు ఆసుపత్రులను నిర్మించగలిగితే వైద్యానికి ఇబ్బంది ఉండదు. ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి అనుసంధానం చేస్తాం. మన రాష్ట్రంలో మరో కొన్ని ఆసుపత్రులను అనుసంధానం చేస్తాం. వైద్య రంగంలో మెరుగైన పరిస్థితి తీసుకువస్తాం.

ఈ రోజు 14 మెడికల్‌ కాలేజీలకు శంకుస్థాపన చేస్తున్నాం. ఇదీవరకే రెండు కాలేజీలను ప్రారంభించాం. వీటి నిర్మాణానికి రూ.8 వేల కోట్లు ఖర్చు చేయగలుగుతున్నామని సంతోషంగా చెబుతున్నాను. ప్రాణం విలువ తెలిసిన వ్యక్తిగా, రాబోయే అవసరాలను బేరిజు వేసుకొని, ప్రతి ఒక్కరికి మంచి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ అడుగులు వేస్తున్నాం. ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం చేయడమే కాకుండా పేదవారికి మంచి వైద్యం అందించే కార్యక్రమంలో భాగంగా ఈ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నాం.

పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఉండేలా పిడుగురాళ్ల, మచిలీపట్నం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, మార్కాపురం, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, నంద్యాల, ఆదోని, పాడేరు, పులివెందులలో 16 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నాం.
ప్రతి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్‌ కళాశాల. ప్రత్యేక సేవలతో కూడిన 500 పడకల ఆసుపత్రి, సమగ్ర ఐటీ సేవలు, సీసీ టీవీలు, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 10 మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్లు, సెంట్రలైజ్డ్‌ ఎయిర్‌ కండిషన్‌తో కూడిన ఐసీయూ, అవుట్‌ పేషెంట్‌ డిపార్ట్‌మెంట్, డాక్టర్ల రూమ్‌లు, మెడికల్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌తో అనుసంధానంచేసిన బెడ్లు, ఆక్సిజన్‌ నిల్వ చేసే ట్యాంకులు, ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌లు కూడా ప్రతి కాలేజీలో ఏర్పాటు చేస్తున్నాం.  వీటిలో జాతీయ స్థాయి ప్రమాణాలతో సౌకర్యాలు కల్పిస్తాం.

నాడు–నేడు పథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చుతున్నాం. దాదాపు రూ.16300 కోట్లు ఇందుకు ఖర్చు చేస్తున్నాం. ఇందులో భాగంగా 10111 విలేజి క్లినిక్స్‌ తీసుకువస్తున్నాం. మండలానికి రెండు పీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తున్నాం. మరో 176 కొత్త పీహెచ్‌సీలను నిర్మిస్తున్నాం, 52 ఏరియా ఆసుపత్రులు, 192 కమ్యూనిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే ఉన్న 11 మెడికల్‌కాలేజీల రూపురేఖలు మార్చబోతున్నాం. వీటిలో జాతీయ స్థాయి స్టాండెట్స్‌ ఉంటాయి.
ఐపీహెచ్‌ స్టాండెట్స్‌ ఉంటాయి. ఇవన్నీ కూడా 2023 డిసెంబర్‌ నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం.

గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు రూ.246 కోట్లతో ఐదు గిరిజన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించేందుకు శ్రీకారం చుట్టాం. ఉద్దానం ప్రాంత ప్రజల కోసం కిడ్నీ రిసెర్చ్‌ సెంటర్, కడపలో మానసిక ఆరోగ్య కేంద్రం, క్యాన్సర్‌ ఆసుపత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం.

దేశంలో ఏ రాష్ట్రంలో కనీవిని ఎరుగని విధంగా వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ సేవల్లో ఘననీయమైన మార్పులు తెచ్చాం. ఈ రోజు 2436 వైద్య సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాం. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే అన్ని సేవలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాం. వైద్యం ఏ ఒక్కరికి కూడా భారం కాకూడదని ప్రతి కుటుంబాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాం. ఆపరేషన్‌ అయ్యాక విశ్రాంతి సమయంలో కూడా వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా ద్వారా నెలకు రూ.5 వేలు పరిహారం ఇస్తున్నాం.

దృష్టిలోపాలు ఉన్న వారికి ప్రభుత్వమే ఉచితంగా ఆపరేషన్లు చేయించి, కంటి  అద్దాలు కూడా అందజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి మేలు జరిగే కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కాంక్లియర్‌ ఇన్‌ప్లాంట్‌ ఆపరేషన్‌ చేయించే పరిస్థితిలోకి తీసుకువచ్చాం. క్యాన్సర్‌ వంటి చికిత్సలు కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాం.
130 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాం.

దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమయ్యేవారికి తోడుగా ఉండేందుకు పింఛన్‌ను రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచామని సగర్వంగా చెబుతున్నాను. ప్రతి గ్రామంలో వైయస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్‌లో 91 రకాల మందులు అక్కడే అందుబాటులో ఉంచుతాం. అక్కడే ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు నివాసం ఉంటారు. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు ఉంటారు. ప్రతీ పీహెచ్‌సీకి 104 వాహనం అందుబాటులో ఉంటుంది. డాక్టర్లు 7 గ్రామాలను దత్తత తీసుకుంటారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ తీసుకువస్తున్నాం.
ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌ నుంచి కోలుకునేందుకు ఈ వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చాం. కోవిడ్‌ తరువాత కొత్త కొత్తగా వస్తున్న ఫంగస్‌లను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చామని గర్వంగా చెబుతున్నాను.

ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ద్వారా రెండేళ్లలో రూ.5215 కోట్లు చెల్లించామని సగర్వంగా చెబుతున్నాను. శస్త్ర చికిత్సలకే రూ.3650 కోట్లు చెల్లించాం.  ఈ రోజు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నాం. 9710 పోస్టులు పూర్తిగా భర్తీ చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైద్య ఆరోగ్య రంగంలో ఇన్ని వేల పోస్టులు భర్తీ చేసింది గతంలో ఎప్పుడూ చూడలేదు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డబ్యూ›్లహెచ్‌వో, ప్రమాణాలు ఉండేలా మార్పు చేశాం. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల మందులతో రోగం నయం కాదన్న భయం ఉండేది. ఈ పరిస్థితిని మార్చేశాం.

రాష్ట్రవ్యాప్తంగా 1180 ఒకేసారి 108 వాహనాలు అందజేశాం. మరో విషయం ఇక్కడ ప్రకటిస్తున్నాం. కోవిడ్‌ సమయంలో ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు కేంద్రం ప్రకటించిన పరిహారం అందకపోతే రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు పరిహారం అందజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కరోనాతో మరణిస్తే..ఆ కుటుంబాన్ని త్వరగా ఆదుకునేందుకు సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయాలని సీఎస్‌కు ఆదేశాలు జారీ చేస్తున్నాం. 40కి పైగా సంక్షేమ పథకాలతో పాటు మీ కుటుంబ సభ్యుడిగా నిండు మనసుతో దృష్టి పెట్టామని సగర్వంగా చెబుతున్నాను.

అసెంబ్లీ సాక్షిగా, అనేక సందర్భాల్లో కోవిడ్‌ సేవలను వివరించాం. రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి ప్రయత్నంలో ఎలాంటి లోటు లేదని, ఉండదని మరోక్కసారి మాట ఇస్తూ మనందరి ప్రభుత్వం, మీ అందరికీ మరించి మంచి చేసేలా ఈ ప్రభుత్వంపై దేవుడి దయ, మీ అందరి ఆçశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వర్చువల్‌ విధానంలో 14 మెడికల్‌ కాలేజీలకు శంకుస్థాపన చేశారు.

ఆదోనికి మహర్దశ :- గుమ్మనూరు జయరాం :-

కర్నూలు, మే 31 :- ఆదోని డివిజన్ లో ఆదోని – ఎమ్మిగనూరు జాతీయ రహదారి పక్కన ఆరెకల్ విలేజ్ వద్ద 58.44 ఎకరాల విస్తీర్ణంలో రూ. 475 కోట్లతో అత్యాధునిక వసతులతో నిర్మించబోతున్న మెడికల్ కళాశాల నిర్మాణంతో అత్యంత వెనుకబడిన నియోజకవర్గాలు ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ ప్రజల కల సాకారం అవుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు.

సోమవారం ఆదోని మెడికల్ కాలేజ్ సంబంధించి ఫైలన్ స్టోన్ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పాత్రికేయులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన ఆరు దశాబ్దాల కాలంలో 11 వైద్య కళాశాలల ఏర్పాటైతే జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండేళ్ల కాలంలోనే వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ పేదలందరికీ మెరుగైన వైద్య సదుపాయం కోసం 16 మెడికల్ కాలేజీలు మంజూరు చేసి ఒకే సారి ఇన్ని వైద్య కళాశాలలను నిర్మించేందుకు శ్రీకారం చుట్టడం దేశంలోనే అరుదైన రికార్డుగా నిలిచిపోతుందన్నారు. దీంతో 5 కోట్ల ప్రజానీకం తరపున రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. ఆదోనిలో మెడికల్ కళాశాల ఏర్పాటుతో ఆదోని ప్రజల కల నెరవేరిందిని, ఆదోని డివిజన్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. పాత్రికేయుల సమావేశంలో ఇంచార్జి కలెక్టర్ రామ సుందర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఆదోని మెడికల్ కాలేజి శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, జిల్లా ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి, ఆంధ్ర వాల్మీకి బోయ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుసూదన్, ఆంధ్ర వీరశైవ లింగాయత్ చైర్మన్ రుద్ర గౌడ్, ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్ శాంతమ్మ,ఆదోని ఆర్ డి ఓ రామకృష్ణా రెడ్డి, నాగలాపురం సర్పంచ్ కోట పరమేష్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఆదోని మెడికల్ కాలేజ్ సంబంధించి ఫైలన్ స్టోన్ శిలాఫలకాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, జిల్లా ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు.

అనంతరం మెడికల్ కాలేజ్ సంబంధించి భూములిచ్చిన 18 మంది రైతులకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, జిల్లా ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి లు శాలువాతో ఘనంగా సన్మానం చేశారు.

నంద్యాల మెడికల్ కాలేజ్ వర్చువల్ విధానం శంకుస్థాపన కార్యక్రమంలో  నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచ బ్రహ్మానంద రెడ్డి ,ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి , పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆళ్ళగడ్డ శాసనసభ్యులు బిజేంద్రారెడ్డి , నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ,ఆళ్ళగడ్డ మున్సిపల్ చైర్మన్ రామలింగారెడ్డి, నంద్యాల మున్సిపల్ చైర్మన్ మాబున్ని, జాయింట్ కలెక్టర్( అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జిలాని సామున్, నంద్యాల సబ్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి, జాయింట్ కలెక్టర్ ( ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed