
శ్రీశైలదేవస్థానం:మార్గశిర శుద్ధ షష్ఠిని పురస్కరించుకుని రేపు (09.12.2021) న సుబ్రహ్మణ్యషష్ఠి మహోత్సవం నిర్వహిస్తున్నారు.
ఈ ఉత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి (కుమారస్వామి) ప్రత్యేక అభిషేకం, పూజాదికాలు, సుబ్రహ్మణ్యహోమం, తదితర కార్యక్రమాలు జరుగుతాయి.
ఉదయం గం.9.00ల నుండి శ్రీ సుబ్రహ్మణ్యహోమం జరుగుతుంది.
లోకకల్యాణం కోసం ప్రతి మంగళవారం, షష్ఠి , కృత్తికా నక్షత్రం రోజులలో సుబ్రహ్మణ్యస్వామివారికి విశేష అభిషేకం నిర్వహిస్తారు.
అదేవిధంగా ప్రతిరోజు కూడా ఆర్జిత సేవగా వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరకల్యాణం చేస్తారు.
సుబ్రహ్మణ్యషష్ఠిని పురస్కరించుకుని ఈ పూజాదికాలతో పాటు హోమం కూడా వుంటుంది.
| విశేష అభిషేకం |
ఈ పూజాదికాలకు ముందు లోక క్షేమాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు సంకల్పాన్ని చెబుతారు. దేశం శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరిత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, అన్ని సామాజిక వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఈ సంకల్పంలో పేర్కొంటారు.
సంకల్పం తరువాత పూజాదికాలు నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజ నిర్వహిస్తారు.
తరువాత పంచామృతాలతోను గంధోదకం, భస్మోదకం, బిల్వోదకం, పుష్పోదకం మరియు మల్లికాగుండంలోని పుణ్యజలంతో సుబ్రహ్మణ్యస్వామివారికి అభిషేకం చేస్తారు. అనంతర స్వామివారికి పూజాదికాలు చేస్తారు.
| సుబ్రహ్మణ్యహోమం ||
ఈ పూజాదికాల తరువాత లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సుబ్రహ్మణ్యహోమం నిర్వహిస్తారు.
ఈ హోమానికి సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి ఎదురుగా ప్రత్యేకంగా హోమగుండాన్ని ఏర్పాటు చేసారు.
శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారి ఆరాధన వలన, సంతానం లేనివారికి సత్సంతానం కలుగుతుందని , వివాహం కానివారికి వివాహయోగం సిద్ధిస్తుందని ,గ్రహదోషాలు ముఖ్యంగా రాహు,కేతు, కుజదోషాలు, సర్పదోషాలు నివారణ అవుతాయని నమ్మకం. ఋణబాధలు తీరి, శత్రుబాధలు తొలగిపోతాయని, న్యాయవివాదాలలో విజయం లభిస్తుందని ,అనారోగ్యం తొలగి ఆరోగ్యం చేకూరి కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి.