
శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణార్థం దేవస్థానం 21 రోజులపాటు శీతలాదేవి హోమాన్ని నిర్వహిస్తోంది.
ఈ విశేష హోమాన్ని వైశాఖ శుద్ధ ఏకాదశి అయిన ఈ రోజున (22.05.2021) ప్రారంభించారు. వచ్చే నెల జ్యేష్ఠశుద్ధ పాడ్యమి, జూన్ 11వ తేదీన ఈ శీతలాదేవి హోమం పూర్తి అవుతుంది.
ప్రతిరోజు సాయంకాలం శ్రీఅమ్మవారి యాగశాలలో ఈ విశేషహోమం వుంటుంది. కార్యక్రమములో భాగంగానే శీతలాదేవి మంత్ర జపాలు కూడా వుంటాయి.
రాష్ట్ర దేవదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ విశేష కార్యక్రమం జరుగుతోంది.
ఈ హోమాన్ని ఆచరించడం వలన అమ్మవారు లోకాలను చల్లగా చూస్తారని నమ్మకం .
ప్రస్తుతం ఏర్పడిన విపత్కర పరిస్థితులు తొలగిపోయి అందరికి ఆయురారోగ్యాలు చేకూరాలనే సంకల్పంతో ఈ హోమం చేస్తున్నారు.
అమ్మవారి యాగశాలలో ఈ రోజు (22.05.2021) ఉదయం 8.30 గంటల నుండి హోమసంకల్పం, గణపతిపూజ, ఋత్విగ్వరణం తదితర కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం హోమం జరిగింది .
సంకల్పం:
ముందుగా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు, వేదపండితులు సంకల్పాన్ని పఠించారు.
దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికి ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు జరగకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన, ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, అన్ని సామాజిక వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని సంకల్పించారు.
ప్రజలందరు రోగాలకు గురికాకుండా ఆరోగ్యంగా వుండేందుకు ముఖ్యంగా ఆరోగ్యానికి హానికలిగించే కరోనా వైరస్ మొదలైన సూక్ష్మాంగజీవులు వ్యాప్తి చెందకుండా నశించాలని కూడా వేదపండితులు, అర్చకులు సంకల్పాన్ని పఠించారు.
గణపతిపూజ:
సంకల్పపఠనం తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజ చేసారు .
ఋత్విగ్వరణం:
గణపతిపూజ తరువాత ఋత్విగ్వరణం జరిగింది . ఈ ఋత్విగ్వరణంలో ఆయా హోమ సంబంధి కార్యక్రమాలు నిర్వహించవలసినదిగా ఋత్వికులను ఆహ్వానిస్తూ వారికి తాంబులాలను అందించారు.
ఈ సాయంత్రం 6.30గంటల నుంచి హోమకార్యక్రమం జరిపారు.
కాగా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో వుంచుకుని భౌతిక దూరం పాటిస్తూ, ఏకాంతంగా అర్చకస్వాములు, వేదపండితులు ఈ కార్యక్రమాలను చేస్తున్నారు.
| మహామృత్యుంజయ పాశుపత హోమం |
కాగా ఇప్పటికే లోకకల్యాణం కోసం దేవస్థానం ప్రతిరోజు మహామృత్యుంజయ పాశుపత హోమాన్ని నిర్వహిస్తోంది.
40 రోజులపాటు జరిగే ఈ పాశుపత మృత్యుంజయ హోమం ఈ నెల 16వ తేదీన ప్రారంభమైంది.
జూన్ 25వ తేదీన ఈ పాశుపత మృత్యుంజయ హోమం ముగియనున్నది.
శ్రీశైల దేవస్థానం లోకకల్యాణార్థం మృత్యుంజయ మంత్రజప పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్ర దేవదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ పారాయణలు జరుపుతున్నారు.
ప్రస్తుతం ఏర్పడిన విపత్కర పరిస్థితులు తొలగిపోయి అందరికీ ఆయురారోగ్యాలు చేకూరాలనే సంకల్పంతో ఈ పారాయణ కార్యక్రమం చేస్తున్నారు.
ప్రతిరోజు ఉదయం 8.00గంటలకు ఈ పారాయణలను నిర్వహిస్తారు.
వైశాఖ శుద్ధ ఏకాదశి అయిన నేడు (22.05.2021) న ఈ మృత్యుంజయ మంత్ర పారాయణలను ప్రారంప్రారంభించారు.
ఈ పారాయణలలో అంతర్జాలం ద్వారా భక్తులు కూడా పాల్గొని, మంత్ర పారాయణను చేసే అవకాశం ఉంది.
ప్రతిరోజు ఉదయం 8.00గంటలకు గూగుల్ మీట్ లింక్ ద్వారా భక్తులు ఈ పారాయణలో పాల్గొనవచ్చు.
పారాయణ ప్రారంభానికి ముందస్తుగా – ” గూగుల్ లింక్ ను దేవస్థానం వెబ్ సైట్ www.srisailadevasthanam.org ద్వారా తెలుపుతారు.
భక్తులందరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా దేవస్థానం వారు కోరారు.
ఈనాటి పారాయణ కార్యక్రమములో రాష్టదేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా. జి. వాణీమోహన్ కూడా పాల్గొన్నారు.