
శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 11 నుండి 21 వరకు , 11 రోజులపాటు నిర్వహిస్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించేందుకు శనివారం కార్యనిర్వహణాధికారి లవన్న దేవస్థానం యూనిట్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షకులు, ప్రధానార్చకులు, స్థానాచార్యులు, వేదపండితులతో ప్రాథమిక సమావేశాన్ని నిర్వహించారు.
స్థానిక తహశీల్దార్ బి. రాజేంద్రసింగ్, శ్రీశైల పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. దివాకర్ రెడ్డి, మండల ప్రాథమిక వైద్యశాల వైద్యాధికారి డా. సోమశేఖరయ్య, దేవస్థానం వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న అపోలో వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
సమావేశ ప్రారంభంలో కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ జిల్లా యంత్రాంగ సహాయ సహకారాలతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిబ్బంది అందరు కృషి చేయాలని సూచించారు.దేవస్థానం ఉద్యోగులందరు కూడా సమర్థవంతంగా విధులు నిర్వహించి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. దేవస్థానం అన్ని విభాగాలు కూడా సమిష్టిగా పరస్పర సమన్వయంతో ఉత్సవ నిర్వహణలో విధులు నిర్వహించాలన్నారు.
తరువాత గత సంవత్సరపు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, గత సంవత్సరపు ఉత్సవాల డాక్యుమెంటరీ ప్రదర్శించారు.అనంతరం కార్యనిర్వహణాధికారి విభాగాల వారీగా బ్రహ్మోత్సవ ఏర్పాట్లకు సంబంధించిన అంశాలను గురించి కూలంకుషంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయా విభాగాధిపతులకు, పర్యవేక్షకులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
వైదిక సిబ్బంది, ఆలయ విభాగాధికారులు పరస్పర సమన్వయంతో ఉత్సవాలలో జరిగే ఆయా కైంకర్యాలన్నీ ఎలాంటి లోటు లేకుండా సంప్రదాయబద్ధంగా జరిపించాలన్నారు. ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి హరిదాసును ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అన్ని విభాగాల వారిని ఆదేశించారు.ఏర్పాట్లన్ని కూడా ముందస్తుగానే చేపట్టి పూర్తి చేయాలన్నారు. ప్రతి విభాగం కూడా ఆక్షన్ ప్లాన్ (ఏర్పాట్ల ప్రణాళిక రూపొందించి కార్యాలయానికి సమర్పించాలన్నారు. ఆక్షన్ ప్లాన్ అనుగుణంగా ఏర్పాట్లను వెంటనే చేపట్టాలన్నారు.బ్రహ్మోత్సవాల ప్రారంభంనాటికంతా ప్రతి ఏర్పాటు కూడా పూర్తి కావాలన్నారు.
తరువాత ఉత్సవాలలో నిర్వహించాల్సిన ఆయా వైదిక కార్యక్రమాలు, వాహనసేవలు స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ, ఉత్సవాల సమయములో ఆలయ వేళలు, దర్శనం ఏర్పాట్లు మొదలైన వాటి గురించి చర్చించారు.ఉత్సవాల లో ఆయా కైంకర్యాలలో సమయపాలనను ఖచ్చితంగా పాటించాలన్నారు.
అనంతరం పాదయాత్రతో వచ్చే భక్తుల సౌకర్యార్ధం నాగలూటి, పెద్దచెరువు, భీముని కొలను, కైలాసద్వారం, సాక్షిగణపతి మొదలైన చోట్ల చేయవలసిన ఏర్పాట్ల గురించి చర్చించారు. అటవీశాఖ వారి సహకారం తో నడకదారిలో వచ్చే భక్తులకు ఆయా ఏర్పాట్లను కల్పించాలని ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు రామకృష్ణను ఆదేశించారు.ముఖ్యంగా శివదీక్షా భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు, జ్యోతిర్ముడి సమర్పణకు చేయాల్సిన ఏర్పాట్లు మొదలైనవాటి గురించి పలు ఆదేశాలు జారీ చేశారు.
మహాశివరాత్రికి వచ్చే భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు ఆరుబయలు ప్రదేశాలలో పైప్ పెండాల్ఫ్, షామియానాలు మొదలైన వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తాత్కాలిక వసతి ప్రదేశాలలో తగినన్ని విద్యుద్దీపాలను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా తాత్కాలిక వసతి ప్రదేశాలలో తప్పనిసరిగా మంచినీటి ఏర్పాటు ఉండాలని కూడా ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు రామకృష్ణను ఆదేశించారు.క్యూకాంప్లెక్స్ లో క్యూలైన్ల లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.
ముఖ్యంగా దర్శనానికి వేచివుండే భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం మొదలైన వాటిని అందజేస్తుండాలని అన్నప్రసాదవితరణ విభాగ పర్యవేక్షకులు దేవికను ఈ ఓ ఆదేశించారు.క్యూలైన్లన్నీ ధృడంగా ఉండేవిధంగా ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ప్రజాసౌకర్యాలకు (మూత్రశాలలు, మరుగుదొడ్లు) అవసరమైన అన్ని మరమ్మతులు చేయించి అన్నింటిని కూడా వినియోగంలోకి వచ్చేవిధంగా తగు ఏర్పాట్లు చేయాలని పారిశుద్ధ్య విభాగపు సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డిని ఆదేశించారు.క్షేత్ర పరిధిలో అవసరమైన చోట్ల అదనపు కుళాయిలను ఏర్పాటు చేయాలన్నారు.స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా క్షేత్రపరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పట్ల ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలన్నారు.
పార్కింగ్ ఏర్పాట్లు, సామానులు భద్రపర్చుగది. ట్రాఫిక్ నియంత్రణ మొదలైన అంశాలపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, భద్రతా విభాగం ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. గత సంవత్సరం కంటే కూడా ఈ సారి అదనపు ప్రదేశాలలో కూడా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు.బ్రహ్మోత్సవాలలో ట్రాఫిక్ జాం కాకుండా వుండేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ వారిని కోరారు.
పాతాళగంగలో కూడా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలన్నారు. ముఖ్యంగా పాతాళగంగలో సేఫ్టీ మెష్ (రక్షణ కంచె), పాతాళగంగలో మహిళలు దుస్తులు మార్చుకునేందుకు అవసరమైన గదుల ఏర్పాటు పాతాళగంగమెట్లమార్గములో అవసరమైన మరమ్మతులు మొదలైన వాటిపట్ల శ్రద్ధ కనబర్చాలన్నారు.
ఉత్సవాలలో పండుగ వాతావరణం ఉండేవిధంగా విద్యుద్దీపాలంకరణ ఉండాలని ఎలక్ట్రికల్ విభాగపు డిప్యూటీ ఇంజనీరు మల్లికార్జున ప్రసాద్ ను ఆదేశించారు.ఆరుబయలు ప్రదేశాలలో తగినంతగా విద్యుద్దీపాల ఏర్పాటు ఉండాలన్నారు.ఉత్సవాలలో పుష్పాలంకరణను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఉద్యానవన అధికారి లోకేష్ ను ఆదేశించారు.
భక్తులను అలరించేందుకు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ప్రజాసంబంధాల అధికారి శ్రీనివాసరావును ఆదేశించారు.అనంతరం తహశీల్దార్ రాజేంద్రసింగ్ మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో కల్పించే వసతి ఏర్పాట్లు, ఉత్సవాలకు విచ్చేసే ప్రభుత్వసిబ్బంది తదితర అంశాల గురించి వివరించారు.
తరువాత సర్కిల్ ఇన్స్పెక్టర్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో చేయవలసిన బందోబస్తు ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలను వివరించారు.అనంతరం మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్ర వైద్యులు డా. సోమశేఖరయ్య మాట్లాడుతూ వైద్యఆరోగ్యపరంగా చేపట్టవలసిన చర్యలను వివరించారు.