


శ్రీశైల దేవస్థానం:గురువారం ఉదయానికి పౌర్ణమి ఘడియలు రావడంతో దేవస్థానం శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించింది.
ఈ రోజు సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్ల మహామంగళహారతుల అనంతరం ఈ గిరిప్రదక్షిణ ప్రారంభమయింది.
ఆలయ మహాద్వారం నుండి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధర మండపం, అంకాళమ్మ ఆలయం, నందిమండపం, బయలువీరభద్రస్వామి ఆలయం నుండి అలంకారేశ్వర ఆలయం మీదుగా వలయ రహదారిపైకి చేరుకుంది. అక్కడి నుండి సారంగధర మఠం మీదుగా సాగి హేమారెడ్డి మల్లమ్మ మందిరం వద్దకు చేరుకుంది. హేమారెడ్డి మల్లమ్మ మందిరం నుంచి మహిషాసురమర్ధిని, రుద్రాక్షమఠం, విభూతిమఠాల మీదుగా రుద్రవనంలోకి చేరుకుంది.
రుద్రవనం నుంచి నందిమండపం వద్దకు రావడంతో ఈ గిరి ప్రదక్షిణ ముగిసింది.
శ్రీశైల క్షేత్రములోని ప్రాచీన మఠాలను, ఆలయాలను భక్తులచేత దర్శింపజేయిస్తూ వారిలో భక్తిభావాలను మరింతగా పెంపొందింపజేయాలని, అదేవిధంగా క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ గిరిప్రదక్షిణను నిర్వహిస్తున్నారు.గిరిప్రదక్షిణలో పాల్గొన్న భక్తులందరికీ ప్రదక్షిణానంతరం శ్రీస్వామివార్లదర్శనం కల్పిస్తున్నారు.
