
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం దసరా మహోత్సవాలు అక్టోబరు 7 నుండి 15వ తేదీ వరకు జరుగనున్నాయి.
ఈ మహోత్సవ నిర్వహణకు సంబంధించి చేయాల్సిన ఆయా ఏర్పాట్లపై ఈ రోజు (20.09.2021) న సమీక్షా సమావేశం జరిగింది.
ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, అధ్యాపక, వేదపండితులు, అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు తదితర సిబ్బంది ఈ సమీక్షా సమావేశం లో పాల్గొన్నారు.
ఈ సమావేశం లో కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న ప్రారంభ ప్రసంగాన్ని చేస్తూ ముఖ్యంగా కోవిడ్ నివారణ చర్యలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించాల్సి వుందన్నారు.
ఉత్సవాలలో శ్రీస్వామిఅమ్మవార్లకు జరిపించాల్సిన ఆయా కైంకర్యాలు, భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, దర్శనం ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు మొదలైన అంశాల గురించి కూలంకుషంగా చర్చించారు.
సమావేశం లో ఈ క్రింది నిర్ణయాలు తీసుకున్నారు. ఉత్సవ రోజులలో శ్రీస్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్ని పరిపూర్ణంగా జరిపించాలని కార్యనిర్వహణాధికారి వైదిక సిబ్బందికి సూచించారు. అదేవిధంగా వైదిక కార్యక్రమాల నిర్వహణలో సమయపాలన ఖచ్చితంగా పాటించాలని కూడా కార్యనిర్వహణాధికారి సూచించారు. • కోవిడ్ నివారణ చర్యలలో భాగంగా ఈ సంవత్సరం దసరా ఉత్సవాలలో కూడా గత సంవత్సరం వలనే శ్రీస్వామి అమ్మవార్ల గ్రామోత్సవం నిలుపుదల చేసారు. ఉత్సవ సమయం లో ప్రతిరోజూ ఆలయ ఉత్సవం మాత్రమే ఉంటుంది. భక్తుల మరియు సిబ్బంది ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. • గ్రామోత్సవం నిలుపుదల చేసిన కారణంగా భక్తులు ఆయా ఉత్సవ విశేషాలను వీక్షించేందుకు వీలుగా గంగాధర మండపం వద్ద ఎల్.ఈ.డి స్క్రీన్లను ఏర్పాటు చేయాలని కార్యనిర్వహణాధికారి ఆదేశించారు. ఉత్సవాలలో ఆలయ ప్రాంగణము, ఆలయ పరిసరాలు మొదలైనవన్నీ శోభయామానంగా వుండేవిధంగా కళాత్మకమైన విద్యుద్దీపాలంకరణ చేయాలని కార్యనిర్వహణాధికారి ఆదేశించారు. ఆలయ ప్రాంగణముతో పాటు మాడవీధులలో కూడా ఉత్సవ వాతావరణం ప్రతిబింబించే విధంగా ఆలయ ప్రాకార కుడ్యానికి కూడా విద్యుద్దీపాలంకరణ చేయాలని కూడా ఆదేశించారు.
ఉత్సవాల సందర్భంగా సంప్రదాయ పద్ధతిలో తగిన విధంగా ప్రత్యేకంగా పుష్పాలంకరణ చేయాలని కార్యనిర్వహణాధికారి ఆదేశించారు.. • ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతీరోజూ నిత్య కళావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని కార్యనిర్వహణాధికారి ఆదేశించారు. అయితే కోవిడ్ నివారణ మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాల నిర్వహణను చేపట్టాలన్నారు. ఆలయ ఉత్సవంలో కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జానపద కళారూపాల ప్రదర్శనను కూడా ఏర్పాటు చేయాలన్నారు.
ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు శ్రీస్వామివారికి విశేష అర్చనలు, అమ్మవారికి ప్రత్యేకపూజలు, రుద్రయాగం, చండీయాగం, అమ్మవారి ఉత్సవమూర్తికి నవదుర్గ అలంకరణలు, స్వామి అమ్మవార్లకు వివిధ వాహనసేవలు జరుగనున్నాయి. అక్టోబరు 7వ తేదీన ఉదయం 8.30గంటలకు అమ్మవారి ఆలయ యాగశాల ప్రవేశముతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి . ప్రారంభ పూజలలో వేదస్వస్తి, ఉత్సవ సంకల్పం, గణపతిపూజ, పుణ్యాహవచనం, కంకణపూజ, దీక్షాసంకల్పం, ఋత్విగ్వరణం, అఖండదీపస్థాపన, వాస్తుపూజ, మండపారాధన,చండీకలశ స్థాపనలు జరుగుతాయి. • తరువాత 10.45గంటల నుండి స్వామివారి ఆలయములో యాగశాలప్రవేశము, చతుర్వేద పారాయణలు, శివసంకల్పం, గణపతి పూజ అఖండదీపస్థాపన, వాస్తుపూజ, శ్రీదేవికలశస్థాపన ఉంటాయి. • ఉత్సవాలలో ప్రతిరోజూ శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశరుద్రాభిషేకం, రుద్రపారాయణలు, అమ్మవారికి శ్రీచక్రార్చన, విశేషకుంకుమార్చనలు,సువాసినీ పూజ, కాళరాత్రిపూజఉంటాయి. లోకకల్యాణం కోసం ఉత్సవాలలో ప్రతీరోజు జపాలు, పారాయణలు చేస్తారు. • అక్టోబరు 15వ తేదీన ఉదయం యాగపూర్ణాహుతి, కలశోద్వాసన, అవబృథం తదితర కార్యక్రమాలు చేస్తారు. • దసరా సందర్భంగా మహర్నవమి రోజున రాష్ట్ర ప్రభుత్వం వారిచే శ్రీస్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించబడుతాయి. • అక్టోబరు 15న విజయదశమి సందర్భంగా సాయంకాలం శమీపూజతో ఉత్సవాలు ముగియనున్నాయి. • ఆర్జిత సేవలలో ప్రతీరోజు స్వామివారి అభిషేకం, అమ్మవారి కుంకుమార్చన, కల్యాణోత్సవం, ఏకాంతసేవ, యథావిధిగా ఉంటాయి. అయితే ఆర్జిత సేవలందు గతం లో వలనే చండీహోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, లక్షకుంకుమార్చన, నవావరణపూజ నిలుపుదల చేసారు.
ఉత్సవాలలో విశేష అలంకారములు – వాహనసేవలు:
తేది వారం శ్రీఅమ్మవారి అలంకారం వాహనసేవలు
07.10.2021 | గురువారం , శైలపుత్రి, భృంగివాహనం
8.10.2021 | శుక్రవారం, బ్రహ్మచారిణి, మయూరవాహనం
09.10.2021 | శనివారం, చంద్రఘంట, రావణవాహనం
10.10.2021 | ఆదివారం, కూష్మాండదుర్గ,కైలాసవాహనం
11.10.2021 | సోమవారం | స్కందమాత,శేషవాహనం
12.10.2021 | మంగళవారం | కాత్యాయని,హంసవాహనం
13.10.2021 | బుధవారం, కాళరాత్రి,గజవాహనం |
14.10 . 2021 గురువారం, మహాగౌరి,నందివాహనం
15.10.2021 | శుక్రవారం, సిద్ధిదాయిని (ఉదయం)
భ్రమరాంబాదేవి నిజాలంకరణ) ( సాయంత్రం) అశ్వవాహనం (ఉదయం) ,నంది వాహనం సాయంత్రం |
(ఆలయ ఉత్సవం)