
శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం దసరా మహోత్సవాలు ఈ నెల 7 నుండి ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ దసరా మహోత్సవాలు అక్టోబర్ 15వ తేదీతో ముగియనున్నాయి.
సంప్రదాయాన్ని అనుసరించి జరిగే ఈ ఉత్సవాలలో శ్రీ అమ్మవారికి నవదుర్గ అలంకారాలు, ప్రత్యేక నవావరణ పూజలు, స్వామి అమ్మవార్లకు వాహనసేవలు, చండీయాగం, రుద్రయాగం జరగనున్నాయి.
ముఖ్యంగా కోవిడ్ నివారణ చర్యలను పాటిస్తూ ఉత్సవాలను నిర్వహిస్తారు. కోవిడ్ ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఈ సంవత్సరం గ్రామోత్సవం నిలుపుదల చేసారు. అయితే శ్రీస్వామిఅమ్మవార్ల ప్రాకారోత్సవం (ఆలయ ఉత్సవం) యథావిధిగా జరుగుతుంది.
గ్రామోత్సవం నిలుపుదల చేసిన కారణంగా భక్తులు ఆయా ఉత్సవ విశేషాలను వీక్షించేందుకు వీలుగా గంగాధర మండపం వద్ద ఎల్.ఈ.డి స్క్రీన్లను ఏర్పాటు చేసారు.
ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు శ్రీస్వామివారికి విశేష అర్చనలు, అమ్మవారికి ప్రత్యేకపూజలు, రుద్రయాగం, చండీయాగం, అమ్మవారి ఉత్సవమూర్తికి నవదుర్గ అలంకరణలు, స్వామి అమ్మవార్లకు వివిధ వాహనసేవలను నిర్వహిస్తారు.ఈ ఉత్సవాలకు నాందిగా రేపు (07.10.2021) న ఉదయం 8.30 గంటలకు అమ్మవారి ఆలయ మండపంలో యాగశాల ప్రవేశం చేసి గణపతిపూజ, స్వస్తిపుణ్యాహవచనము, దీక్షాసంకల్పం, కంకణపూజ, ఋత్విగ్వరణం, కంకణపూజ, కంకణధారణ కార్యక్రమాలు వుంటాయి.
తరువాత అమ్మవారి యాగశాలలో అఖండ స్థాపన, వాస్తుపూజ, వాస్తుహోమం, నవగ్రహ మండపారాధన, చండీ కలశస్థాపనము, చతుర్వేద పారాయణలు, విశేష కుంకుమార్చనలు, గణపతి పంచాక్షరీ, సుబ్రహ్మణ్మ, బాల, నవగ్రహ జపానుష్టాలు, సూర్యనమస్కారాలు, కుంకుమార్చనలు, కుమారి పూజలు జరుగుతాయి.
అదేవిధంగా 10.45 గంటలకు శ్రీస్వామివారి యాగశాలలో యాగశాలప్రవేశం చేసి శివసంకల్పం, గణపతిపూజ, అఖండదీపస్థాపన, వాస్తుపూజ, మండపారాధనలు, రుద్రకలశస్థాపన, స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మధ్యాహ్నకాలార్చనలు, మహానివేదనలు జరుగుతాయి.
ఈ ఉత్సవాలలో భాగంగానే సాయంకాలం నుండి అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, రుద్రహోమం, అమ్మవారికి నవావరణార్చన, కుంకుమార్చనలు జరుగుతాయి.
ఆ తరువాత రుద్రహోమం, చండీహోమం వుంటాయి. అనంతరం రాత్రి 9.00గంటల నుండి నీరాజనమంత్ర పుష్పములు, సువాసిని పూజ, మహదాశీర్వచనం, తీర్థప్రసాదవితరణ కార్యక్రమాలు జరుగుతాయి.
కాగా ఈ కార్యక్రమ నిర్వహణకు రాష్ట్ర వివిధ ప్రాంతాల నుండి 49మంది ఋత్వికులను ఏర్పాటు చేసారు. దేవస్థానం అర్చకస్వాములు, వేదపండితులతో పాటు వీరు కూడా ఉత్సవ నిర్వహణలో పాల్గొంటున్నారు.
శైలపుత్రి అలంకారం – రేపు (07.10.2021) నవరాత్రి మహోత్సవాలలో నవదుర్గ అలంకారంలో భాగంగా శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తిని శైలపుత్రి స్వరూపంలో అలంకరిస్తారు. ద్విభుజాలను కలిగిన ‘ఈ దేవి కుడిచేతిలో త్రిశూలాన్ని, ఎడమచేతిలో పద్మాన్ని ధరించి ఉంటుంది. నవదుర్గలలో ప్రథమ రూపమైన ఈ దేవిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలగడంతో పాటు సర్వత్రా విజయాలు లభిస్తాయని నమ్మకం. ముఖ్యంగా ఈ దేవీ ఆరాధన వలన ముత్తైదువులకు ఐదవతనం వృద్ధి చెందుతుందని నమ్మకం.
భృంగివాహనసేవ: ఈ ఉత్సవాలలో శ్రీ స్వామి అమ్మవార్లకు నిర్వహిస్తున్న వాహనసేవలలో భాగంగా రేపు (07.10.2021) భృంగివాహనసేవ వుంటుంది. ఈ వాహనసేవలో శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరింపజేసి, భృంగివాహనంపై వేంచేబు చేయించి పూజాదికాలు చేస్తారు.