ఫాల్గుణ పౌర్ణమిన సంప్రదాయరీతిలో జరిగిన శ్రీశైల గిరిప్రదక్షిణ
శ్రీశైలదేవస్థానం:ఫాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకొని దేవస్థానం ఈ రోజు సాయంత్రం (28.03.2021) న శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా నిర్వహించింది.ఈ రోజు సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్ల కు మహామంగళహారతుల అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో వేంచేబు చేయించి ప్రత్యేకపూజలు జరిపారు. తరువాత శ్రీస్వామి అమ్మవార్ల పల్లకీ ఊరేగింపుతో శ్రీశైల గిరిప్రదక్షిణ ప్రారంభమయింది.
ఆలయ మహాద్వారం నుండి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధరమండపం, అంకాళమ్మ ఆలయం, నందిమండపం, గంగాసదనం, బయలువీరభద్రస్వామి ఆలయం, అక్కడ నుండి వలయ రహదారి మీదుగా పంచమఠాలు, మల్లమ్మ కన్నీరు, పుష్కరిణి వద్దకు చేరింది. అక్కడి నుండి తిరిగి నందిమండపం వద్దకు చేరుకుంది. నందిమండపం నుండి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకోవడంతో ఈ గిరిప్రదక్షిణ ముగిసింది.
శ్రీశైలగిరి ప్రదక్షిణ ఎంతో ప్రాశస్త్యం ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. త్రేతాయుగం లో శ్రీరాముడు తిపురాంతకం, సిదవటం, ఉమామహేశ్వరం, అలంపురం మొదలెన ద్వార కేతాలగుండా గిరిప్రదక్షిణ ఆచరించినట్లు శ్రీశైలఖండం చెబుతోంది.
శ్రీశైలక్షేత్రములోని ప్రాచీనమఠాలను, ఆలయాలను భక్తులచేత దర్శింపజేయిస్తూ వారిలో భక్తిభావాలను మరింతగా పెంపొందింపజేయాలని, అదేవిధంగా క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ గిరిప్రదక్షిణను నిర్వహించారు.
గిరిప్రదక్షిణ అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేసారు.
Post Comment