
శ్రీశైలదేవస్థానం:శ్రీశైలదేవస్థానం దసరా మహోత్సవాలు ఈ రోజు (07.10.2021) న ఉదయం ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ మహోత్సవాలు 15వ తేదీతో ముగియనున్నాయి.
ఈ ఉత్సవాలలో ప్రతిరోజు శ్రీ అమ్మవారి
కి నవదుర్గ అలంకరణలు, ప్రత్యేక నవావరణ పూజలు, స్వామిఅమ్మవార్లకు వాహనసేవలు, చండీహోమం, రుద్రహోమం, జపములు, పారాయణలు చేస్తున్నారు.
ఆలయ ప్రవేశం :
ఉత్సవ నిర్వహణలో భాగంగా ముందుగా కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న దంపతులు, ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, స్థానాచార్యులు, అర్చకస్వాములు, వేదపండితులు, అధికారులు ఆలయ ప్రవేశం చేశారు. సంప్రదాయబద్ధంగా పసుపు, కుంకుమలు, ఫలపుష్పాదులతో ఆలయ ప్రవేశం చేసారు.
ఈ ఉత్సవాలకు నాందిగా ఈ ఉదయం 8.30 గంటలకు అమ్మవారి ఆలయ మండపంలో యాగశాలప్రవేశం, గణపతిపూజ, దీక్షాసంకల్పం, కంకణపూజ, కంకణధారణ, ఋత్విగ్వరణం కార్యక్రమాలు జరిగాయి.
అనంతరం అమ్మవారి యాగశాలలో అఖండదీపస్థాపన, వాస్తుపూజ, మండపారాధనలు, చండీకలశస్థాపన, శ్రీచక్రార్చన, నవగ్రహజపాలు, చతుర్వేద పారాయణలు, చండీసప్తశతి, మహావిద్యా పారాయణలు, సూర్య నమస్కారాలు జరిగాయి.
అదేవిధంగా స్వామివారియాగశాలలో యాగశాలప్రవేశం, గణపతిపూజ, శివసంకల్పం, అఖండ దీపస్థాపన, వాస్తుపూజ, మండపారాధనలు, రుద్రకలశస్థాపన కార్యక్రమాలు జరిగాయి.
స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పూజలను నిర్వహించారు.
ఉత్సవ సంకల్పం:
లోక కల్యాణం కోసం నిర్వహించే ఈ ఉత్సవ సంకల్పంలో ఉత్సవాలను పురస్కరించుకుని అతివృష్టి, అనావృష్టి నివారించబడి, సకాలములో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, దేశం సుభిక్షంగా ఉండి, సుఖశాంతులు విలసిల్లాలని, అకాల మరణాలు సంభవించకుండా ఉండాలని, జనులందరికీ సుఖసంతోషాలు కలగాలని పేర్కొన్నారు.
ప్రజలు రోగాలకు గురికాకుండా ఆరోగ్యంగా వుండేందుకు ముఖ్యంగా ఆరోగ్యానికి హానికలిగించే కరోనా వంటి సూక్ష్మాంగజీవులు వ్యాప్తి చెందకుండా నశించాలని కూడా వేదపండితులు, అర్చకులు సంకల్పాన్ని పఠించారు.
సంకల్పపఠనం తరువాత ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజను జరిపారు.
కంకణపూజ – కంకణ ధారణ :
గణపతి పూజ తరువాత కంకణాలకు శాస్తోక్తంగా పూజాదికాలు నిర్వహించారు. అనంతరం కార్యనిర్వహణాధికారి, అర్చకస్వాములు, స్థానాచార్యులు కంకణాలను ధరించారు.
ఋత్విగ్వరణం :
కంకణధారణ తరువాత ఋత్విగ్వరణం నిర్వహించారు. ఉత్సవాలలో ఆయా వైదిక కార్యాలను నిర్వహించమని ఋత్వికులను ఆహ్వానిస్తూ వారికి దీక్షావస్త్రాలను అందజేసే కార్యక్రమానికే ఋత్విగ్వరణం అని పేరు.
అమ్మవారి యాగశాలలో కార్యక్రమాలు
తరువాత అమ్మవారి యాగశాలలో పుణ్యాహవాచనం, అఖండదీపస్థాపన, వాస్తుపూజ, వాస్తు హోమం, మండపారాధన, చండీకలశస్థాపన, శ్రీ చక్రార్చన జరిపారు.
అదేవిధంగా ఉత్సవాలలో భాగంగానే అమ్మవారికి నవావరణార్చన, విశేష కుంకుమార్చనలు జరిగాయి.
స్వామివారి యాగశాలలో కార్యక్రమాలు :
ఉత్సవాలలో భాగంగానే ఈ ఉదయం శివసంకల్పం, గణపతిపూజ, పుణ్యాహవాచనం, చండీశ్వరపూజ, ఋత్విగ్వరణం, అఖండదీపస్థాపన, వాస్తుపూజ, మండపారాధన, రుద్రకలశస్థాపన జరిగాయి.
అదేవిధంగా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపారు.
రుద్రహోమం – చండీహోమం :
ఉత్సవాలలో భాగంగానే ప్రతీరోజు రుద్రహోమం, చండీ హోమం కార్యక్రమాలు చేస్తున్నారు.
కుమారి పూజ :
దసరా మహోత్సవాలలో భాగంగా కుమారి పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ కుమారి పూజలో రెండు సంవత్సరాల నుంచి పదిసంవత్సరాల వయస్సు ఉన్న బాలికకు పూలు, పండ్లు, నూతనవస్త్రాలను సమర్పించి పూజిస్తారు. కుమారి పూజ నవరాత్రి ఉత్సవాలలో ఒక ముఖ్యమైన సంప్రదాయం . జపపారాయణలు:
ఉత్సవాలను పురస్కరించుకుని లోకకల్యణం కోసం చతుర్వేదపారాయణలు, నవగ్రహజపాలు, చండీ సప్తశతిపారాయణ, మహావిద్యాపారాయణ, సూర్యనమస్కారాలు జరుగుతున్నాయి.
శ్రీశైలఖండ పారాయణ :
ఈ సంవత్సరం ఉత్సవాలలో స్కాందపురాణములోని శ్రీశైలఖండ పారాయణలు కూడా చేస్తున్నారు.
దేవస్థానం చేపట్టిన శ్రీశైలఖండ ప్రచురణలో మూలప్రతిని పరిష్కరించి సంస్కృతములో మూలగ్రంథమును, తెలుగులో శ్లోకభావార్థములను రూపొందించడములో ముఖ్యపాత్రను పోషించిన శ్రీక్రిష్టి లక్ష్మీసీతారామాంజనేయ శర్మ, భీమవరం వారిచే ఈ శ్రీశైలఖండ పారాయణలు జరిపించబడుతోంది. సాయంకాల కార్యక్రమాలు :
ఉత్సవాలలో భాగంగా ఈ సాయంకాలం అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలు ప్రత్యేకం.
శైలపుత్రి అలంకారం ఈ నవరాత్రి మహోత్సవాలలో చేయబడుతున్న నవదుర్గ అలంకారంలో భాగంగా ఈ సాయంకాలం శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తిని శైలపుత్రి స్వరూపంలో అలంకరణ ప్రత్యేకం . ద్విభుజాలను కలిగిన ఈదేవి కుడి చేతిలో త్రిశూలాన్ని, ఎడమచేతిలో పద్మాన్ని ధరించి ఉంటుంది. నవదుర్గలలో ప్రథమ రూపమైన ఈదేవిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలగడంతో పాటు సర్వత్రా విజయాలు లభిస్తాయని ప్రతీతి.ముఖ్యంగా ఈ దేవీ ఆరాధన వలన ముత్తైదువులకు ఐదవ తనం వృద్ధి చెందుతుందని చెప్పబడుతోంది.
భృంగివాహనసేవ ఈ ఉత్సవాలలో భాగంగా శ్రీస్వామిఅమ్మవార్లకు నిర్వహిస్తున్న వాహనసేవలలో భాగంగా ఈ రోజు భృంగివాహనసేవ ప్రత్యేకం. ఈ వాహనసేవలో శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరింపజేసి భృంగివాహనంపై వేంచేబు చేయించి పూజాదికాలు ప్రత్యేకం.