
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం లోక కల్యాణం కోసం ఈ రోజు (17.08.2021) న ఆలయప్రాంగణంలోని నందీశ్వరస్వామికి (శనగల బసవన్న స్వామివారికి) విశేషార్చనలను జరిపింది.
ప్రతి మంగళవారం, త్రయోదశి రోజున దేవస్థాన సేవగా సర్కారీసేవగా ఈ కైంకర్యం ఉంటుంది. ప్రదోషకాలంలో సాయంసంధ్యాసమయంలో ఈ విశేష పూజలు నిర్వహించారు.
ఈ విశేషార్చనలో ముందుగా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరిత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని,
జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, అన్ని సామాజికవర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు, వేదపండితులు సంకల్పాన్ని చెప్పారు.
అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజను జరిపారు.
ఆ తరువాత నందీశ్వరస్వామికి పంచామృతాలతోనూ, ద్రాక్ష, బత్తాయి, అరటి మొదలైన ఫలోదకాలతో హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్లోదకం మరియు మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం జరిపారు. తరువాత నందీశ్వరస్వామికి అన్నాభిషేకం జరిగింది.
పురుష సూక్తం, వృషభసూక్తం మొదలైన వేదమంత్రాలతో ఈ విశేషాభిషేకాన్ని చేసారు. తరువాత నందీశ్వరస్వామివారికి నూతన వస్త్ర సమర్పణ, విశేష పుష్పార్చనలను చేసారు. తరువాత నానబెట్టిన శనగలను నందీశ్వరస్వామికి సమర్పించారు. చివరగా స్వామికి నివేదన జరిగింది.