
శ్రీశైల దేవస్థానం:గురువారం ఉదయానికి త్రయోదశి ఘడియలు రావడంతో నందీశ్వరస్వామి వారికి పరోక్షసేవగా విశేషార్చన జరిపారు.
ప్రతి మంగళవారం, త్రయోదశి రోజులలో దేవస్థానసేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం వుంటుంది.
ప్రతి నెలలో కూడా త్రయోదశి రోజులలో అనగా శుద్ధ త్రయోదశి , బహుళ త్రయోదశి రోజులలో భక్తులు నందీశ్వరస్వామివారి పూజను పరోక్షసేవగా జరిపించుకునే అవకాశం కూడా కల్పించారు.
గురువారం మొత్తం 18 మంది భక్తులు పరోక్షసేవగా ఈ నందీశ్వరస్వామి విశేషపూజను జరిపించుకున్నారు.
ఇందులో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా ఈ పూజలను నిర్వహించుకుంటున్నారు.
ఈ పూజాదికాలలో ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజను
జరిపారు.
ఆ తరువాత నందీశ్వరస్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలతోనూ, పలు ఫలోదకాలతోనూ హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం, మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహించారు. తరువాత నందీశ్వరస్వామికి అన్నాభిషేకం నిర్వహించారు.
పురుషసూక్తం, వృషభసూక్తం మొదలైన వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా ఈ విశేషాభిషేకాన్ని జరిపారు. తరువాత నందీశ్వరస్వామివారికి నూతన వస్త్ర సమర్పణ, విశేషపుష్పార్చనలు జరిగాయి. తరువాత నానబెట్టిన శనగలను నందీశ్వరస్వామికి సమర్పించారు. చివరగా స్వామికి నివేదన జరిగింది.
త్రయోదశి రోజున నందీశ్వరస్వామివారి పరోక్షసేవకు భక్తులు ఆన్లైన్ ద్వారా రూ.1,116/-లను సేవా రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.
భక్తులు సేవారుసుమును www.srisailadevasthanam.org లేదా aptemples.ap.gov.in ద్వారా చెల్లింపు చేయవచ్చు.
నందీశ్వరస్వామివారి ఆరాధన వలన సంతానంలేనివారికి సంతానం కలుగుతుందని, సమస్యలు తొలగి సుఖసంతోషాలు కలుగుతాయని, ఋణ బాధలు తీరుతాయని, అనారోగ్యం తొలగి ఆరోగ్యం చేకూరుతుందని, కష్టాలు నివారించబడతాయని, మానసిక ప్రశాంతత చేకూరుతుందని పండితులు పేర్కొంటున్నారు.
అదేవిధంగా ఈ స్వామికి నానబెట్టిన శనగలను సమర్పించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అందుకే ఈ స్వామివారికి శనగలబసవన్న అనే పేరు కూడా ప్రసిద్ధంగా ఉంది.
ఈ పరోక్షసేవ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించేందుకు వీలుగా ప్రసార వివరాలు, ప్రసారాల సమయం మొదలైనవాటిని ఎప్పటికప్పుడు సేవాకర్తలకు తెలుపుతారు.
సేవాకర్తలేకాకుండా భక్తులందరు కూడా వీటిని శ్రీశైలటి.వి / యూ ట్యూబ్ ద్వారా వీక్షించవచ్చును. భక్తులందరు కూడా ఈ పరోక్షసేవను సద్వినియోగం చేసుకోవాలని ఈ ఓ కోరారు. ఇతర వివరాలకు దేవస్థానం సమాచార కేంద్ర ఫోన్ నంబర్లు 83339 01351/52/53/54/ 55/56 లను సంప్రదించవచ్చును.