
శ్రీశైల దేవస్థానం:లోక కల్యాణం కోసం దేవస్థానం 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు 4 రోజులపాటు శ్రీశైల ద్వారాక్షేత్రాలలో అక్కడి అధిదేవతలకు ప్రత్యేక పూజలను నిర్వహించనున్నది.
“చతుర్ద్వార అర్చన”గా పిలువబడే ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి ఆయా ద్వారక్షేత్రాలలో ప్రత్యేక పూజలను జరిపించిన తరువాత చివరి రోజున శ్రీశైలంలో శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలను జరిపించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ కార్యక్రమాన్ని గిరిప్రదక్షిణ అనే పేరుతో కూడా పిలుస్తారు.
ఈ అర్చనలలో ప్రతి ఆలయంలోను శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, శ్రీ అమ్మవారికి సహస్రనామార్చన నిర్వహిస్తారు.
ఈ విశేష కైంకర్యంలో శ్రీశైల దేవస్థానం తరుపున ప్రతీ ఆలయంలోను అక్కడ అధిదేవతలకు వస్త్రాలు సమర్పిస్తారు. అదే విధంగా ప్రతీ ఆలయంలోను అర్చక సత్కారం వుంటుంది . ఈ సత్కార కార్యక్రమంలో ఆయా ఆలయాలలోని ప్రధాన అర్చకులకు, ఉపప్రధానార్చకులకు దేవస్థానం తరుపున వస్త్రాలు, శ్రీ స్వామిఅమ్మవార్ల ప్రసాదాలు మరియు సంభావన అందిస్తారు.
ఈ కార్యక్రమంలో భాగంగా 8 న శ్రీశైలక్షేత్ర తూర్పుద్వారమైన ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకంలోనూ, 9న దక్షిణ ద్వారమైన కడప జిల్లాలోని సిద్ధవటంలోనూ, 10న పశ్చిమద్వారమైన తెలంగాణా రాష్ట్ర జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపురంలోనూ, 11న నాగర్ కర్నూలు జిల్లాలోని ఉత్తరద్వారమైన ఉమామహేశ్వరంలో పూజలను నిర్వహించడం జరుగుతుంది. 12న ఈ దేవస్థానములో శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా విశేషపూజలు జరుగుతాయి.
శ్రీశైలానికి నేరుగా రోడ్డుమార్గం లేని పూర్వపు రోజులలో ఈ నాలుగు క్షేత్రాల మీదుగా భక్తులు శ్రీశైలాన్ని చేరుకోవడంతో ఈ నాలుగు క్షేత్రాలు శ్రీశైల ద్వార క్షేత్రాలుగా ప్రసిద్ధికెక్కాయి.