శ్రీశైల దేవస్థానం: మంగళవారం మధ్యాహ్న సమయానికి అమావాస్య ఘడియలు రావడంతో, లోకకల్యాణం కోసం, దేవస్థానం ఈ సాయంకాలం శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామివారికి విశేషపూజలను జరిపింది.
ప్రతీ మంగళవారం, అమావాస్య రోజులలో ఈ విశేషార్చనను చేస్తారు.
కాగా అమావాస్య రోజున భక్తులు కూడా పరోక్షసేవగా ఈ అర్చనను జరిపించుకునే అవకాశం కల్పించారు.
ఈ రోజు పరోక్షసేవ ద్వారా 21 మంది భక్తులు ఈ విశేష పూజలను జరిపించుకున్నారు.
తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుండి కూడా భక్తులు ఈ పూజలను జరిపించుకుంటున్నారు.
కాగా ఈ పూజాదికాల కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతి పూజను
చేసారు.
ఈ పూజాదికాలలో పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో వీరభద్రస్వామివారికి అభిషేకం చేసారు.
ఈ స్వామి ఆరాధన వలన గ్రహదోషాలు నివారించబడుతాయని, అరిష్టాలన్నీ తొలగి పోతాయని, ఎంతటి క్లిష్ట సమస్యలైనా పరిష్కరించబడతాయని, ప్రమాదాలు నివారించబడతాయని, సర్వకార్యానుకూలత లభిస్తుందని, అభీష్టాలు సిద్ధిస్తాయని పండితులు పేర్కొంటున్నారు.
ఈ పరోక్షసేవకు భక్తులు ఆన్లైన్ ద్వారా రూ.1,116/- లను సేవా రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. భక్తులు సేవారుసుమును www.srisailadevasthanam.org లేదా aptemples.ap.gov.in ద్వారా చెల్లింపు చేయవచ్చు.
కాగా ఈ పరోక్షసేవ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించేందుకు వీలుగా ప్రసార వివరాలు, ప్రసారాల సమయం మొదలైనవాటిని ఎప్పటికప్పుడు సేవాకర్తలకు తెలుపుతున్నారు.
సేవాకర్తలేకాకుండా భక్తులందరు కూడా వీటిని శ్రీశైలటి.వి / యూ ట్యూబ్ ద్వారా వీక్షించవచ్చును. భక్తులందరు కూడా ఈ పరోక్షసేవను సద్వినియోగం చేసుకోవాలని దేవస్థానం ఈ ఓ కోరారు. ఇతర వివరాలకు దేవస్థానం సమాచార కేంద్ర ఫోన్ నంబర్లు 83339 01351 / 52 / 53 / లను సంప్రదించవచ్చును