*శ్రీశైలానికి వచ్చే భక్తులకు మెరుగైన ఏర్పాట్లు
*దర్శనానికి వచ్చే భక్తులు సంయమనం పాటించాలి
*జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి గణియా
శ్రీశైలం/నంద్యాల, ఫిబ్రవరి 11 :-
శ్రీశైల బ్రహ్మోత్సవాల సందర్భంగా క్షేత్రానికి వచ్చే భక్తుల కోసం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేపట్టామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. బుధవారం శ్రీశైలం కమాండ్ కంట్రోల్ రూంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్తో కలిసి నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల దృష్ట్యా జిల్లా యంత్రాంగం సమన్వయంతో దేవదాయ, అటవీ, పోలీసు, రెవెన్యూ తదితర శాఖలు సమగ్ర చర్యలు చేపట్టాయని తెలిపారు. ఈ ఏడాది కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. నిన్న ఒక్కరోజే స్వామి, అమ్మవార్లను సుమారు 71 వేల మంది భక్తులు దర్శించుకున్నారని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం స్పర్శ దర్శనం, అలంకార దర్శనం కోసం వేర్వేరు క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్పర్శ దర్శనానికి కొంత సమయం ఎక్కువగా, అలంకార దర్శనం తక్కువ సమయంలో పూర్తవుతుందని చెప్పారు. అధిక రద్దీ కారణంగా దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉన్నందున భక్తులు సహనంతో వ్యవహరించాలని సూచించారు.
శ్రీశైలం క్షేత్రానికి వచ్చే ప్రతి భక్తుడు ఆధ్యాత్మిక భావనతో దర్శనానికి వస్తారని, అదే భక్తి భావాన్ని దర్శనం పూర్తయ్యే వరకు కొనసాగించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అలాగే క్షేత్ర పరిశుభ్రతను కాపాడేందుకు భక్తులు ఉపయోగించిన ఆహార పదార్థాల అవశేషాలు, ప్లాస్టిక్ వస్తువులను తప్పనిసరిగా డస్ట్బిన్స్లో వేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారుల సహకారంతో బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. రవాణా సౌకర్యం కోసం అదనంగా 460 బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు.
జిల్లాలోని ఇతర శైవ క్షేత్రాల్లో కూడా ఇదే తరహా ఏర్పాట్లు చేపట్టామని, మహానంది క్షేత్రంలో శివరాత్రి సందర్భంగా సుమారు 30 వేల మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.
