శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం దేవస్థానం మంగళవారం ఉదయం ఆలయప్రాంగణంలోని శ్రీసుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేష పూజలను నిర్వహించారు.
ప్రతి మంగళవారం, కృత్తికా నక్షత్రం, షష్ఠి తిథి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి ఈ విశేషఅభిషేకం , పూజాదికాలు దేవస్థానంసేవగా (సర్కారిసేవగా) నిర్వహిస్తున్నారు.
కుమారస్వామివారికి పూజలు జరపడం వలన లోకకల్యాణమే కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగి ఆయా పనులు సక్రమంగా జరుగుతాయి. సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహంతో శత్రుబాధలు, గ్రహపీడలు, దృష్టి దోషాలు మొదలైనవి తొలగిపోతాయి. అలాగే సంతానం కోసం పూజించేవారికి తప్పక సంతానభాగ్యం లభిస్తుందని నమ్మకం.
ఈ అభిషేకానికి ముందుగా, దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, జనులందరూ సుఖశాంతులతో ఉండాలంటూ అర్చక స్వాములు సంకల్పాన్ని పఠించారు.
తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజ జరిపారు. అనంతరం శ్రీసుబ్రహ్మణ్యస్వామివారికి అభిషేకము, అర్చన తరువాత సుబ్రహ్మణ్యస్తోత్ర పారాయణలు జరిగాయి.
సుబ్రహ్మణ్యస్వామి అభిషేకంలో స్వామివారికి పంచామృతాలైన పాలు,పెరుగు,తేనె,నెయ్యి, కొబ్బరి నీళ్ళు , వివిధ పండ్ల రసాలతో అభిషేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా వివిధ పండ్ల రసాలతో చేసే అభిషేకంతో ఎంతో ఫలితం ఉంటుందని ఆగమాలు చెబుతున్నాయి.
బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల అభిషేకం:
లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు సాయంకాలం శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామివారికి విశేషపూజలను జరిపారు.
ప్రతీ మంగళవారం , అమావాస్య రోజులలో బయలువీరభద్రస్వామివారికి ఈ విశేష అభిషేకం, అర్చనలను నిర్వహిస్తున్నారు.
బయలువీరభద్రస్వామివారు శివభక్తగణాలకు అధిపతి. అదేవిధంగా శ్రీశైల క్షేత్రపాలకుడుగా క్షేత్రానికి ఆరుబయట ఉండి, ఎటువంటి ఆచ్ఛాదన, ఆలయం లేకుండగా బయలుగా దర్శనమిస్తాడు కనుక ఆయనకు బయలువీరభద్రస్వామి అని పేరు వచ్చింది. ప్రసన్నవదనంతో కిరీట మకుటాన్ని కలిగి దశభుజుడైన స్వామివారు పది చేతులలో వివిధ ఆయుధాలతో దర్శనమిస్తాడు. స్వామివారికి క్రిందివైపున కుడివైపు దక్షుడు, ఎడమవైపు భద్రకాళి దర్శనమిస్తారు.
నందీశ్వరస్వామికి విశేషపూజ;
లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర స్వామికి (శనగల బసవన్న స్వామివారికి) విశేషార్చనలను నిర్వహించారు.
ప్రతి మంగళవారం , త్రయోదశి రోజున దేవస్థానసేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం జరుగుతోంది.. ప్రదోషకాలంలో అనగా సాయం సంధ్యా సమయంలో ఈ విశేష పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ విశేషార్చనలో ముందుగా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరిత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, జనులందరూ సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు, వేదపండితులు సంకల్పాన్ని చెప్పారు.
అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకుమహాగణపతిపూజను జరిపారు.
ఆ తరువాత నందీశ్వరస్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలతోనూ, ఫలోదకాలతో హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం ,,, మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహించారు . తరువాత నందీశ్వరస్వామికి అన్నాభిషేకం నిర్వహించారు.
వృషభసూక్తం మొదలైన వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా ఈ విశేషాభిషేకాన్ని చేశారు. తరువాత నందీశ్వరస్వామివారికి నూతనవస్త్ర సమర్పణ, విశేషపుష్పార్చనలను చేశారు.. అనంతరం నానబెట్టిన శనగలను నందీశ్వరస్వామికి సమర్పించారు.
చివరగా స్వామికి నివేదన సమర్పించారు
