హైదరాబాద్, డిసెంబర్ 23 : రాష్ట్రంలో స్వయం సహాయక బృందాల మహిళలచే మొదటి విడతలో దాదాపు 231 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్ లను ఏర్పాటు చేయడానికి సత్వర చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పలు పధకాలను సోమవారం సచివాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యదర్శి లోకేష్ కుమార్, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీజన, సెర్ప్ సి.ఈ.ఓ దివ్య తదితరులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, ఐదు జిల్లాల్లో తొలిదశలో 231 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్ లను రానున్న ఆరునెలల్లో ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఖాళీగా ఉన్న దేవాదాయ భూములను లీజుకు తీసుకొని అందులో స్వయం సహాయక బృందాల మహిళల ద్వారా సోలార్ ప్లాంట్ లను ఏర్పాటు చేసి, . రాష్ట్ర మహిళా సంఘాల సభ్యులను కోటీశ్వరులను చేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పంలో భాగంగా, ఈ మహిళా సంఘాలచే 150 ఎలక్ట్రిక్ బస్సులను సేకరించి, వాటి నిర్వహణా బాధ్యతలను ఆర్టీసీ కి అప్పగించాలని తెలిపారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో జరుగుతున్న జిల్లా సమాఖ్య భవనాల నిర్మాణాలను జూన్ మాసాంతం లోపు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియచేసారు. మాదాపూర్ లోని ఇందిరా మహిళా శక్తి బాజార్ లో జనవరి 25 లోగా ‘సరస్ మేళా’ నిర్వహించడానికి చర్యలు చేపట్టాలన్నారు.