
శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం ఆలయ ఈశాన్య భాగంలో రుద్ర వనములోని (రుద్రపార్కులోని) రుద్రమూర్తికి శుక్రవారం శాస్త్రోక్తంగా పూజాదికాలు జరిగాయి.
ఈ రుద్రమూర్తి విగ్రహాన్ని గతంలో వైశాఖ మాసములో నెలకొల్పారు . ఈ కారణంగా ప్రతి సంవత్సరం వైశాఖ మాసములో ఆరుద్రా నక్షత్రం రోజున ఈ రుద్రమూర్తికి ప్రత్యేక పూజాదికాలు జరుగుతాయి
కాగా ఈ రోజు ఉదయం జరిగిన పూజాదికాలలో ముందుగా లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు. ఈ సంకల్పంలో దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రకృతి వైపరీత్యాలు నివారించబడాలని, దేశంలో సుఖశాంతులు విలసిల్లాలని, అకాల మరణాలు సంభవించకుండా ఉండాలని, జనులందరికీ సుఖసంతోషాలు కలగాలని పేర్కొన్నారు.
తరువాత రుద్రమూర్తికి అభిషేకం నిర్వహించారు. అర్చకులు రుద్రమంత్రాలను పఠిస్తుండగా శాస్త్రోక్తంగా పంచామృతాలతోనూ, గందోధకం, భస్మోదకం, పుష్పోదకం, బిల్వోదకం, సుగంధోదకాలతోనూ, ఆ తరువాత జలంతోనూ ఈ అభిషేకం నిర్వర్తించారు.
అనంతరం రుద్రదేవునికి బిల్వార్చనను జరిపి పుష్పార్చన చేశారు. ఈ పుష్పార్చనలో వివిధ రకాల పుష్పాలు వినియోగించారు.
రుద్రదేవుని చల్లని చూపులు ఎల్లప్పుడు కృష్ణానదిపై ప్రసరించడం వలన కృష్ణానదిలో నీరు సమృద్ధిగా ఉండి, పంటలు బాగా పండుతాయని, అదే విధంగా శ్రీశైలం ఆనకట్ట ఎల్లప్పుడూ పరిరక్షించబడుతూ ఉంటుందని పలువురు ఆధ్యాత్మికవేత్తలు సూచించడంతో ఆలయ ఈశాన్యభాగంలో కృష్ణానదికి అభిముఖంగా (రుద్రుని దృష్టి కృష్ణానదిపై పడే విధంగా ఈ రుద్రుని విగ్రహాన్ని దేవస్థానం నెలకొల్పారు.
ఈ కార్యక్రమములో డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఆర్. రమణమ్మ, సహాయ కమిషనర్ ఇ. చంద్రశేఖరరెడ్డి, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు ఎం. నరసింహారెడ్డి, అర్చకులు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శంకర జయంతి:
వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా ఈ రోజు ఆదిశంకరులు వారి జయంతి ఉత్సవం నిర్వహించారు. ఈ జయంతి ఉత్సవంలో భాగంగా ఫాలధార – పంచధారల వద్ద గల శంకరమందిరంలో ప్రత్యేక పూజలు జరిపారు.
ఈ పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని ముందుగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ ఆలయ అర్చకులు, వేదపండితులు మహాగణపతిపూజను నిర్వహించారు. తరువాత వేదమంత్రాలతో చంద్రమౌళీశ్వరస్వామివారికి, శ్రీ శారదాదేవికి, శంకరులవారికి విశేషంగా అభిషేకం చేశారు. పంచామృతాలతోనూ, వివిధ ఫలరసాలతోను, పుణ్యజలంతోను ఈ అభిషేకం ఎంతో శాస్త్రోక్తంగా జరిగింది. తరువాత పుష్పార్చన, మహానివేదనలను జరిగాయి.
కాగా ఆదిశంకరులవారికి, శ్రీశైలక్షేత్రానికి చాలా దగ్గరి సంబంధం శంకరులవారు శ్రీశైలంలోని పాలధార – పంచధార వద్ద కొంతకాలం తపస్సు చేసి ఇక్కడే తమ శివానందలహరి గ్రంథాన్ని రచించారు. ఈ శివానందలహరిలో శ్రీశైలక్షేత్రాన్ని, శ్రీభ్రమరాంబా మల్లికార్జునులను స్తుతించారు. అదేవిధంగా శంకరులవారు యోగతారావళి అనే గ్రంథంలో శ్రీశైలంలోనే సమాధిని పొందాలని అభిలషించారని చెప్పబడుతోంది.
ఈ పూజా కార్యక్రమాలలో డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఆర్. రమణమ్మ, అసిస్టెంట్ కమిషనర్ ఇ. చంద్రశేఖరరెడ్డి, అర్చకస్వాములు, వేదపండితులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు