
శ్రీశైల దేవస్థానం:ఆషాఢ పౌర్ణమి సందర్భంగా బుధవారం నిర్వహించనున్న శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారి శాకంభరీ ఉత్సవానికి తగు ఏర్పాట్లన్నీ చేస్తున్నారు.ఇందుకోసం అవసరమైన సుమారు 3వేల కేజీలకు పైగా వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలను, వివిధ రకాల ఫలాలను తెప్పించారు.
వంగ, బెండ, దొండ, కాకర, చిక్కుడు, గోరుచిక్కుడు, మునగ, సొర, బీర, గుమ్మడి, బంగాళదుంప, కందదుంప, క్యాప్సికమ్ (బెంగుళూరు మిరప), క్యాబేజీ, బీన్స్, క్యారెట్, అరటి మొదలైన వివిధ రకాల కూరగాయలు, తోటకూర,పాలకూర, మెంతికూర, చుక్కకూర మొదలైన పలురకాల ఆకుకూరలు, పుదిన, కరివేపాకు, కొత్తిమీర లాంటి సుగంధ పత్రాలు, కమల, బత్తాయి, ద్రాక్ష, ఆపిల్, అరటి, ఫైనాపిల్ మొదలైన పలురకాల ఫలాలు, నిమ్మకాయలు, బాదంకాయలు మొదలైన వాటిని ఈ ఉత్సవానికై తెప్పించారు. శ్రీ భ్రమరాంబాదేవి వారికి విశేష పూజలు జరుగుతాయి. అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని కూడా పలు రకాల ఆకుకూరలు, కూరగాయలతో అలంకరిస్తారు.
శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తికి, ఆలయప్రాంగణంలోని రాజరాజేశ్వరి దేవికి, గ్రామదేవత అంకాళమ్మకు ప్రత్యేకపూజలు విశేషంగా శాకాలంకరణ చేస్తారు.ఈ విధంగా అమ్మవారిని శాకాలతో అర్చించడం వలన అతివృష్టి, అనావృష్టి నివారించబడి, సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండుతాయని, కరువుకాటకాలు నివారించ బడతాయిని పురాణాలు చెబుతున్నాయి.పరాశక్తి స్వరూపమే శాకంభరీదేవి.