×

ఘనంగా శాకంభరీ ఉత్సవం, గురుపౌర్ణమి విశేష పూజలు

ఘనంగా శాకంభరీ ఉత్సవం, గురుపౌర్ణమి విశేష పూజలు

 శ్రీశైల దేవస్థానం:ఆషాఢపౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం  శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి శాకంభరీ ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆకుకూరలు, కూరగాయలు, వివిధ రకాల ఫలాలతో శ్రీ భ్రమరాంబాదేవివారి మూలమూర్తికి, ఉత్సవమూర్తికి, ఆలయప్రాంగణంలోని రాజరాజేశ్వరి అమ్మవారికి, అన్నపూర్ణాదేవి అమ్మవారికి, గ్రామదేవత అంకాళమ్మ అమ్మవారికి శాకాలంకరణ, ఉత్సవసంబంధి పూజాదికాలు జరిపారు.

ఉత్సవంలో భాగంగానే అమ్మవారి ఆలయప్రాంగణాన్ని పలురకాల ఆకుకూరలు, కూరగాయలతో అలంకరించారు.

ఇందుకోసం అవసరమైన వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు, వివిధ రకాల ఫలాలను తెప్పించారు.

వంగ, బెండ, దొండ, కాకర, చిక్కుడు, గోరుచిక్కుడు, మునగ, సొర, బీర, గుమ్మడి బంగాళదుంప, కందదుంప, క్యాప్సికమ్ (బెంగుళూరు మిరప), క్యాబేజీ, బీన్స్, క్యారెట్, అరటి మొదలైన వివిధ రకాల కూరగాయలు, తోటకూర, పాలకూర, మెంతికూర, చుక్కకూర, మొదలైన పలురకాల ఆకుకూరలు, కరివేపాకు, కొత్తిమీర లాంటి సుగంధ పత్రాలు, కమల, బత్తాయి, ఆపిల్, అరటి, పనస మొదలైన అనేక ఫలాలు, నిమ్మకాయలు, బాదంకాయలు మరియు పచ్చిశనగలు మొదలైన వాటిని  తెప్పించారు.

 ఈ ఉత్సవంలో భాగంగా ఆగమశాస్త్రానుసారంగా శ్రీభ్రమరాంబాదేవివారికి ఉత్సవ సంబంధి పూజాదికాలు జరిపారు.

కార్యక్రమములో ముందుగా అర్చక స్వాములు, వేద పండితులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ఉత్సవ సంకల్పాన్ని పఠించారు.సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, అతివృష్టి, అనావృష్టి నివారించబడాలని, అగ్నిప్రమాదాలు, వాహనప్రమాదాలు మొదలైనవి నిరోధించబడాలని, జనులందరు సుఖసంతోషాలతో ఉండాలని ఈ సంకల్పములో కోరారు.తరువాత ఉత్సవాలు నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజ జరిగింది.

ఉత్సవంలో భాగంగానే శాకంభరీగా అలంకరించిన  అమ్మవారి ఉత్సవమూర్తికి కూడా విశేషంగా షోడశోపచార పూజలు జరిపారు.

* పూర్వం హిరణ్యాక్షుని వంశానికి చెందిన దుర్గముడు అనే రాక్షసుడు తన తపశ్శక్తితో వేదాలను అంతర్థానం చేశాడు. దాంతో యజ్ఞయాగాదులు నిలిచిపోయాయి. ఈ కారణంగా కరువుకాటకాలతో తీవ్రక్షామం ఏర్పడింది. అప్పుడు మహర్షులందరూ ఆదిపరాశక్తిని గురించి తపస్సు చేశారు. ఆ తపస్సుకు పరాశక్తి ప్రసన్నురాలై లోకరక్షణకోసం దుర్గముడిని సంహరించి, వేదాలను రక్షించి వైదిక కర్మలను పునరుద్ధరింపజేసింది.

ఈ సందర్భంలోనే జగన్మాత తన నుండి వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు, ఫలాలు మొదలైన శాకాలను సృష్టించి క్షామాన్ని నివారించింది. ఆ విధంగా అవతరించిన అమ్మవారి స్వరూపమే శాకంభరీదేవి.

కాగా ఆషాఢపౌర్ణమిరోజున అమ్మవారిని శాకాలతో అర్చించడం వలన అతివృష్టి, అనావృష్టి నివారించబడి, సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పాడిపంటలు బాగాపండుతాయని, కరువుకాటకాలు నివారించబడుతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ప్రతిసంవత్సరం ఆగమ శాస్త్రోక్తంగా అమ్మవారికి ఈ కైంకర్యాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమములో అర్చకస్వాములు, వేదపండితులు, సహాయ కార్యనిర్వహణాధికారి జి.స్వాములు, పర్యవేక్షకులు అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.

:

గురుపౌర్ణమిని పురస్కరించుకుని  ఉదయం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి హేమారెడ్డి మల్లమ్మ మందిరం వద్ద దక్షిణామూర్తి స్వామివారికి , వ్యాసమహర్షికి విశేష పూజలు జరిపారు.

ఈ కార్యక్రమానికి ముందుగా పూజా సంకల్పం పఠించారు. తరువాత మహాగణపతిపూజ జరిపారు. ఆ తరువాత దక్షిణామూర్తి , వ్యాసమహర్షి చిత్రపటాలకు షోడశోపచార పూజలు జరిగాయి.

కాగా ఒకేరాశిగా ఉన్న వేదాన్ని నాలుగు విభాగాలుగా చేసి లోకానికి అందించిన వ్యాసమహర్షి కారణజన్ముడు. వ్యాసమహర్షి అసలు పేరు ” కృష్ణద్వైపాయనుడు” వేదాలను నాలుగు విభాగాలుగా విభజించి లోకానికి అందించిన కారణంగా ఆయనకు వేదవ్యాసుడు అనే పేరు ప్రసిద్ధమైంది. మంత్రరూపంలో ఉన్న వేదాలయొక్క పరమార్థాన్ని గ్రహించలేని సామాన్యులకోసం వ్యాసమహర్షి మహాభారతాన్ని కూడా రచించాడు. అందువలననే మహాభారత గ్రంథం పంచమవేదంగా పేరొందింది. అదేవిధంగా లోకోద్ధరణ కోసం వ్యాసమహర్షి పద్దెనిమిది పురాణాలను కూడా రచించాడు.

లోకంలో ఉండే ప్రతీ విషయాన్ని కూడా వ్యాసమహర్షి తన సాహిత్యంలో పేర్కొన్నాడని చెబుతారు. అందుకే ఆయన చెప్పని విషయాలు ఏవీ లోకంలో కనబడవనే భావన ఎంతో ప్రసిద్ధం. ఈ కార్యక్రమములో అర్చకస్వాములు, వేదపండితులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed