
శ్రీశైల దేవస్థానం:ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని గురువారం శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి శాకంభరీ ఉత్సవం జరిపారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆకుకూరలు, కూరగాయలు, వివిధ రకాల ఫలాలతో శ్రీ భ్రమరాంబాదేవివారి మూలమూర్తికి, ఉత్సవమూర్తికి, ఆలయ ప్రాంగణంలోని రాజరాజేశ్వరి అమ్మవారికి, అన్నపూర్ణాదేవి అమ్మవారికి, గ్రామదేవత అంకాళమ్మ అమ్మవారికి శాకాలంకరణ, ఉత్సవ సంబంధిత పూజాదికాలు జరిపారు.
ఉత్సవంలో భాగంగానే అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని పలు రకాల ఆకు కూరలు కూరగాయలతో అలంకరించారు.
ఇందుకోసం అవసరమైన సుమారు 3,000 కేజీలకు పైగా వివిధ రకాల కూరగాయలు, సుమారు 100 గుమ్మడికాయలు, 2000లకు పైగా నిమ్మకాయలు, వివిధ రకాల 600 ఆకు కూరల కట్టలు వివిధ రకాల ఫలాలను తెప్పించారు
వంగ, బెండ, దొండ, కాకర, చిక్కుడు, గోరుచిక్కుడు, మునగ, సొర, బీర, గుమ్మడి, బంగాళదుంప, కందదుంప, క్యాప్సికమ్ (బెంగుళూరు మిరప, క్యాబేజీ, బీన్స్, క్యారెట్, అరటి మొదలైన పలు రకాల కూరగాయలు, తోటకూర, పాలకూర, మెంతికూర, చుక్కకూర మొదలైన పలురకాల ఆకుకూరలు, పుదిన, కరివేపాకు, కొత్తిమీర లాంటి సుగంధ పత్రాలు, కమల, బత్తాయి, ద్రాక్ష, ఆపిల్, అరటి, ఫైనాపిల్ మొదలైన పలురకాల ఫలాలు, నిమ్మకాయలు, బాదంకాయలు మొదలైన వాటిని ఈఉత్సవానికి తెప్పించారు.
కాగా ఈ ఉత్సవంలో భాగంగా ఆగమ శాస్త్రానుసారంగా శ్రీభ్రమరాంబాదేవివారికి ఉత్సవ సంబంధి పూజాదికాలు జరిపారు.
కార్యక్రమములో ముందుగా అర్చకస్వాములు, వేదపండితులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ఉత్సవ సంకల్పాన్ని పఠించారు.
వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, అతివృష్టి, అనావృష్టి నివారించబడాలని, అగ్నిప్రమాదాలు, వాహనప్రమాదాలు మొదలైనవి నిరోధించబడాలని, జనులందరు సుఖసంతోషాలతో ఉండాలని ఈ సంకల్పములో కోరారు.
తరువాత ఉత్సవాలు నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజ జరిపారు. ఉత్సవంలో భాగంగానే శాకంభరీగా అలంకరించిన అమ్మవారి ఉత్సవమూర్తికి కూడా విశేషంగా షోడశోపచారపూజలు జరిపారు.
కాగా పూర్వం హిరణ్యాక్షుని వంశానికి చెందిన దుర్గముడు అనే రాక్షసుడు తన తపశ్శక్తితో వేదాలను అంతర్థానం చేశాడు. దాంతో యజ్ఞయాగాదులు నిలిచిపోయాయి. ఈ కారణంగా కరువుకాటకాలతో తీవ్రక్షామం ఏర్పడింది. అప్పుడు మహర్షులందరూ ఆదిపరాశక్తిని గురించి తపస్సు చేశారు. ఆ తపస్సుకు పరాశక్తి ప్రసన్నురాలై లోకరక్షణకోసం దుర్గముడిని సంహరించి, వేదాలను రక్షించి వైదిక కర్మలను పునరుద్ధరింపజేసింది.
ఈ సందర్భంలోనే జగన్మాత తన నుండి వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు, ఫలాలు మొదలైన శాకాలను సృష్టించి క్షామాన్ని నివారించింది. ఆ విధంగా అవతరించిన అమ్మవారి స్వరూపమే శాకంభరీదేవి.
కాగా ఆషాఢ పౌర్ణమిరోజున అమ్మవారిని శాకాలతో అర్చించడం వలన అతివృష్టి, అనావృష్టి నివారించబడి, సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పాడిపంటలు బాగాపండుతాయని, కరువు కాటకాలు నివారించబడుతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ప్రతిసంవత్సరం ఆగమ శాస్త్రోక్తంగా అమ్మవారికి ఈ కైంకర్యాన్ని జరిపించడం జరుగుతోంది. ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు, ఉభయదేవాలయాల ప్రధానార్చకులు, పలువురు అర్చకస్వాములు, వేదపండితులు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.