శివారాధనలో ఎన్నో తాత్విక అంశాలు-బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ
శ్రీశైల దేవస్థానం:హిందూ ధర్మ ప్రచారం లో భాగంగా దేవస్థానం నిర్వహిస్తున్న బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ ‘శివనామ మహిమ’ ప్రవచనాలలో ఆదివారం మూడో నాటి ప్రవచనాలూ ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ముందుగా ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి జ్యోతి ప్రజ్వలన జరిగింది. తరువాత సామవేదం తమ ప్రవచాన్ని ప్రారంభించారు.
శివుని ప్రతి నామం కూడా ఎంతో మహిమాన్వితమైనదన్నారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ. ముఖ్యంగా శివతత్త్వం వ్యక్తి ఔనత్యానికి ఎన్నోమార్గదర్శక సూత్రాలను వివరిస్తున్ధన్నారు. అదేవిధంగా శివారాధనలో ఎన్నో తాత్విక అంశాలు కూడా యిమిడి ఉన్నాయన్నారు.శివ, మహేశ్వర, హర, రుద్ర, మహాదేవ, సదాశివ వంటి ప్రత్యేక నామాలు పరమశివుణ్ని సర్వోన్నతిని చాటి చెబుతున్నాయన్నారు.శివ అనే రెండు అక్షరాలలోనే శక్తి, ఐశ్వర్యం, అమృతత్త్వం దాగి వున్నాయని, శబ్ధ విశిష్టతను విశ్లేషిస్తూ మంత్రశాస్త్రం ఈ విషయాన్ని వ్యాఖ్యానించిందన్నారు.
సందర్భానుసారంగా శ్రీశైలక్షేత్ర మహిమను కూడా షణ్ముఖశర్మ వివరించారు.శ్రీశైలం దివ్యక్షేత్రంగా ప్రసిద్ధమైందన్నారు. దివ్యమైన ప్రదేశాలలో దైవశక్తి ఎంతో ఉజ్జల్వంగా ఆవిష్కరించబడుతుందన్నారు.శ్రీశైలం సాక్షాత్తు శివశక్తుల స్వరూపమన్నారు. జ్యోతిర్లింగక్షేత్రంగా, మహాశక్తిపీఠంగా ప్రశస్తి పొందిన ఈ దివ్యస్థలం శివశక్త్యాత్మకమైన శ్రీ చక్రస్వరూపంగా సంభావించబడుతోందన్నారు.శ్రీశైలక్షేత్రం దివ్యశక్తి అమోఘమైందన్నారు. భౌతిక ఇంద్రియాలతో మనము చూడలేని దివ్యత్వం శ్రీశైలంలో అణువణువునా వ్యాపించియుందన్నారు.
యోగా పరంగా అంత: క్షేత్ర సమన్వయాన్ని చెప్పేటప్పుడు శ్రీశైలాన్ని సహస్రారంగా చెబుతారన్నారు. లౌకిక జీవనములో యోగసాధన ద్వారా సహస్రారానిని చేరుకోలేని సామాన్యులు కేవలం భక్తితో శ్రీశైలక్షేత్రాన్ని దర్శించినంత మాత్రానే ఆ స్థితిని పొందవచ్చునన్నారు.సామాన్యుని సైతం సాధన గమ్యాన్ని చేర్చే శక్తి ఉండడం వలన శ్రీశైలక్షేత్రం సహస్రారంగా చెప్పబడిందన్నారు.ప్రసంగానుసారంగా శివదీక్షా విశేషాలను కూడా వివరించారు.
ప్రవచాననంతరం సామవేద షణ్ముఖ శర్మ వారిని దేవస్థానం వేదమంత్రాల నడుమ ఘనంగా సత్కరించింది.ఈ సందర్భంగా వారికి స్వామివార్ల ప్రసాదం, శేషవస్త్రాలు, జ్ఞాపిక అందించారు.
Post Comment