
*ప్రతి భక్తునికి పూర్తి సంతృప్తి దర్శనమయ్యేవిధంగా, తొక్కిసలాట లేకుండా పటిష్ఠ చర్యలు తీసుకోండి
*మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించండి
*దేవస్థానం అధికారులను, జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించిన మంత్రుల బృందం
శ్రీశైలం/నంద్యాల, ఫిబ్రవరి 10:-మహాశివరాత్రి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీశైల మహాక్షేత్రానికి విచ్చేసే సామాన్య భక్తులకు పెద్దపీట వేసి తొక్కిసలాట లేకుండా శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లను సంతృప్తికరంగా దర్శించుకునేలా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రుల బృందం దేవస్థాన అధికారులను, జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. సోమవారం దేవస్థాన అన్న ప్రసాద వితరణ భవన ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్రూంలో దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, హోం శాఖ మంత్రి వి. అనిత, రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిలు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, దేవదాయశాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్, ఎస్.పి. అధిరాజ్ సింగ్ రాణా గారు, జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్, ఉత్సవాల అధికారి చంద్రశేఖర్ ఆజాద్, దేవస్థాన కార్యనిర్వహణ అధికారి ఎం. శ్రీనివాసరావు గార్లతో కలిసి మహాశివరాత్రి ఏర్పాట్లపై విస్తృత సమావేశం నిర్వహించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి తొక్కిసలాటలు లేకుండా శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లదర్శనమయ్యేలా పటిష్ట ప్రణాళిక రూపొందించుకుని ఆ మేరకు వసతులు కల్పించాలని దేవస్థాన అధికారులను, జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పలు బ్రహ్మోత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, వైభవంగా నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ మేరకు గత సంవత్సరం కంటే ఈ ఏడాది 30 శాతం అధికంగా భక్తులు వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు ఏర్పాట్లు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలన్నారు.
రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖామాత్యులు ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారన్నారు. ప్రతి భక్తునికి శ్రీస్వామిఅమ్మవార్ల అనుగ్రహం పొందేలా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని, హోల్డింగ్ ఏరియా, పార్కింగ్ ప్రాంతాలు సక్రమంగా గుర్తించి పార్కింగ్ ప్రాంతం నుండి ఉచితంగా మినీ వాహనాల ఏర్పాట్లు, దేవాలయం వద్దకు భక్తులను చేర్చేలా ఉండాలని సూచించారు. 11 రోజుల మహాశివరాత్రి కార్యక్రమాలలో క్యూ లైన్ లలో భక్తులకు పాలు, మంచినీరు, బిస్కెట్లు అల్పాహారం పంపిణీ చేయాలని మంత్రి ఆదేశించారు. పసిపిల్లలు కలిగిన వారికి క్యూలైన్లో ఉన్న మహిళలకు పాలు బిస్కెట్లు అందిస్తామని తెలిపారు. మహాశివరాత్రి పర్వదిన సమయాలలో 24, 25, 26,27 నాలుగు రోజులలో క్యూలైన్లలో వచ్చిన భక్తులకు ఉచిత లడ్డు ప్రసాదం అందజేయాలని దేవస్థానం అధికారులను మంత్రి ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు ఆరు డ్రోన్ కెమెరాలను పోలీసు అధికారులకు ఇచ్చేందుకు దేవదాయశాఖ సిద్ధంగా ఉందని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా ఎస్పిని సూచించారు. అలాగే ట్రాఫిక్ అంతరాయం లేకుండా పర్యవేక్షించేందుక అవసరమైన మోటార్ వాహనాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 40 కి.మీ మేర పాదయాత్రతో వచ్చే భక్తులకు స్థానిక చెంచు గూడెములలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మంచినీరు, బిస్కెట్లు తదితర వాటిని ఏర్పాటు చేసుకోవాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.
అటవీ చెక్పోస్టులను, దేవదాయశాఖ చెక్ పోస్టులలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఉచితంగా వాహనాలను అనుమతించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
రెవెన్యూ,పోలీస్, దేవదాయ శాఖలు సమన్వయంతో పని చేయాల్సి ఉంటుందని, ప్రముఖుల దర్శనాలకు టైంస్లాట్ ఏర్పాటు చేయాలన్నారు. ఎంఎల్ఏ సూచనలు ఆహ్వానించదగినవని అన్నారు. ఈ సమావేశానికి ముందు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా శివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను విపులంగా వివరించారు.
సోమవారం ఉదయం దేవదాయశాఖ కమిషనర్, రామచంద్రమోహన్, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్.ఎస్. చంద్రశేఖర అజాద్లు భక్తుల క్యూలైన్లు, పాగాలంకరణ ఏర్పాట్లు, కల్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.