
శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం రోజు శ్రీస్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి.యాగశాల లో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేసారు.అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిపారు.
సాయంకాలం ప్రదోషకాల పూజలు, జపానుష్టానాలు, రుద్రపారాయణలు, హోమాలు జరిపారు.
రథోత్సవం:
సాయంకాలం స్వామిఅమ్మవార్ల రథోత్సవం ఘనంగా జరిగింది. రథోత్సవంలో సంప్రదాయాన్ని అనుసరించి ముందుగా రథాంగపూజ, రథాంగహోమం, రథాంగబలి కార్యక్రమాలు జరిగాయి. రథాంగబలిలో వసంతంతో నింపిన గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, కుంభం (అన్నంరాశి) సాత్వికబలిగా సమర్పించారు. తరువాత శ్రీ స్వామి అమ్మవార్లను రథంపైకి వేంచేబు చేయించి రథోత్సవం జరిపారు.
రథోత్సవ దర్శనం వలన సర్వపాపాలు తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. రథోత్సవాన్ని పురస్కరించుకొని బంతి,చామంతి, గులాబీలు, కాగడాలు, కనకాంబరాలు, చాందిని, గ్లాడియోలస్, కార్నియా, ఆస్టర్స్, మొదలైన 11 రకాల పుష్పాలతో రథాన్ని అలంకరించారు.