భక్తి చైతన్యం కలిగించిన రథోత్సవం
శ్రీశైల దేవస్థానం:ఉగాది మహోత్సవాల నాల్గవ రోజున బుధవారం (ఉగాది పర్వదినం) శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం గం.8.00 నుండి స్వామివారి యాగశాలలో చండీశ్వరపూజ, మండపారాధనలు, లోక కల్యాణం కోసం జపానుష్ఠానాలు రుద్రహోమం నిర్వహించారు. ఉదయం, సాయంత్రం వివిధ పూజలు చేసారు.
రథోత్సవం:
ఈ రోజు సాయంకాలం శ్రీ స్వామిఅమ్మవార్ల రథోత్సవం ఘనంగా జరిగింది. రథోత్సవంలో సంప్రదాయాన్ని అనుసరించి ముందుగా రథాంగపూజ, రథాంగహోమం, రథాంగబలి, కార్యక్రమాలు జరిపారు.
రథాంగబలిలో వసంతంతో నింపిన గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, కుంభం (అన్నరాశి) సాత్వికబలిగా సమర్పించారు.
తరువాత శ్రీ స్వామిఅమ్మవార్లను రథంపైకి వేంచేబు చేయించి రథోత్సవం జరిపారు. ఈ రథోత్సవ దర్శనం వలన సర్వపాపాలు తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం.
కాగా రథోత్సవం సందర్భంగా రథానికి విశేషంగా పుష్పాలంకరణ చేసారు.
రథోత్సవంలో కోలాటం, చెక్కభజన, జానపద పగటి వేషాల ప్రదర్శన, కేరళ కథాకేళి, తప్పెటచిందు, కర్ణాటక జాంజ్, వీరగానీ, కొమ్మువాయిద్యం, కన్నడ జానపదడోలు, నందికోలుసేవ, మొదలైన కార్యక్రమాలను ఏర్పాటు చేసారు.
రమావాణీసేవిత రాజరాజేశ్వరీ అలంకారం:
ఉగాది ఉత్సవాలలో శ్రీ అమ్మవారి అలంకారాలలో భాగంగా ఈ రోజున అమ్మవారి ఉత్సవమూర్తికి రమావాణీ సేవిత రాజరాజేశ్వరీ అలంకారం, అలంకారమూర్తికి విశేషపూజలు జరిగాయి. చతుర్భుజాలను కలిగిన ఈ దేవి పాశం, అంకుశం, పద్మం, చెరకుగడను ధరించి దర్శనం ఇచ్చారు.
ఈ దేవిని దర్శించడం వలన కోరికలు నెరవేరుతాయని, సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్మకం.
Post Comment