శ్రీశైల దేవస్థానం:ఈ నెల 25న రథసప్తమి (మాఘ శుద్ధ సప్తమి) పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో సూర్యారాధన నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమానికి ముందుగా, దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికి ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు జరగకుండా ఉండాలనీ, దేశంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, అన్ని సామాజిక వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు, వేదపండితులు లోక కల్యాణ సంకల్పాన్ని చెప్పనున్నారు.
తరువాత కలశ స్థాపనచేసి కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని, మహాగణపతి పూజ చేస్తారు. అనంతరం వైదికాచార్యులు ఆయా బీజమంత్రాలతోనూ, ప్రత్యేక ముద్రలతోనూ సూర్యనమస్కారాలు చేస్తారు.
ఈ కార్యక్రమంలో భాగంగానే ఉదయం గం. 9.00ల నుండి సూర్యయంత్ర పూజ, అరుణ పారాయణ, షోడశోపచారపూజ, నివేదన, మంత్ర పుష్పము నిర్వహిస్తారు.
కాగా మన పురాణాలలో ఈ సూర్యారాధన ఎంతో విశేషంగా చెప్పబడింది. సూర్యారాధన వల్ల అనారోగ్యం తొలగి ఆరోగ్యం చేకూరుతుందని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రథసప్తమి రోజున సూర్యుని ఆరాధించడం ఎంతో ఫలదాయకం.
