
శ్రీశైల దేవస్థానం: ఉగాది రోజు శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తరువాత స్వామివారి యాగశాలలో చండీశ్వరపూజ, మండపారాధనలు, లోక కల్యాణం కోసం జపానుష్ఠానాలు రుద్రహోమం నిర్వహించారు.అదేవిధంగా ఉదయం అమ్మవారి యాగశాలలో చండీహోమం జరిపారు.అమ్మవారికి విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు జరిగాయి. 5.30 గంటలకు సాయంకాల పూజలు, జపానుష్ఠానములు జరిగాయి.
రథోత్సవం:
ఈ రోజు సాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్ల రథోత్సవం జరిగింది.రథోత్సవంలో సంప్రదాయాన్ని అనుసరించి ముందుగా రథాంగపూజ, రథాంగ హోమం, రథాంగబలి, కార్యక్రమాలు జరిగాయి.రథాంగబలిలో వసంతంతో నింపిన గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, కుంభం (అన్నరాశి) సాత్విక బలిగా సమర్పించారు.
తరువాత శ్రీ స్వామిఅమ్మవార్లను రథంపైకి వేంచేబు చేయించి రథోత్సవం జరిపారు. ఈ రథోత్సవ దర్శనం వలన సర్వపాపాలు తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. రథానికి విశేషంగా పుష్పాలంకరణ చేసారు.
రథోత్సవంలో కోలాటం, చెక్కభజన, జానపద పగటి వేషాల ప్రదర్శన, బుట్టబొమ్మలు గొరవనృత్యం,తప్పెటచిందు, కర్ణాటక జాంజ్, వీరగాసీ, కొమ్మువాయిద్యం, కన్నడ జానపదడోలు, నందికోలుసేవ, కంచుడోలు కార్యక్రమాలను ఏర్పాటు చేసారు.
రమావాణీ సేవిత రాజరాజేశ్వరీ అలంకారం:
ఉగాది ఉత్సవాలలో శ్రీ అమ్మవారి అలంకారాలలో భాగంగా ఈ రోజున అమ్మవారి ఉత్సవమూర్తికి రమావాణీ సేవిత రాజరాజేశ్వరీ అలంకారం, అలంకార మూర్తికి విశేషపూజలు జరిగాయి.చతుర్భుజాలను కలిగిన ఈ దేవి పాశం, అంకుశం, పద్మం, చెరకు గడను ధరించిన దర్శనం ప్రత్యేకం.ఈ దేవిని దర్శించడం వలన కోరికలు నెరవేరుతాయని, సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్మకం.