
శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో పదో రోజు గురువారం ఉదయం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి. శ్రీ స్వామివారి యాగశాల లో శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు చేసారు .రుద్రహోమం, చండీహోమం జరిపారు.తరువాత యాగ పూర్ణాహుతి, వసంతోత్సవం, అవబృథం, త్రిశూల స్నానం, కార్యక్రమాలు జరిగాయి.
పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సుగంధ ద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగ కార్యక్రమాన్ని పూర్తి చేసారు. అనంతరం జరిగిన వసంతోత్సవంలో ఆలయ అర్చకులు, వేదపండితులు వసంతాన్ని (పసుపు, సున్నం కలిపిన మంత్ర పూరిత జలం) సమంత్రకంగా భక్తులపై ప్రోక్షించారు.
తరువాత జరిగిన అవబృథస్నానంలో చండీశ్వరస్వామికి పుష్కరిణీ వద్ద ఆగమ శాస్త్రోక్తంగా స్నానాదిక కార్యక్రమాలు జరిగాయి. చివరగా త్రిశూలస్నాన కార్యక్రమం నిర్వహించారు.
రేపటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు:
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపటితో ముగియనున్నాయి. ఉత్సవాల ముగింపులో భాగంగా రేపు ఉదయం శ్రీస్వామిఅమ్మవార్లకు విశేష పూజలు వుంటాయి.
రేపు సాయంకాలం శ్రీ స్వామివార్లకు అశ్వవాహనసేవ, ఆలయ ఉత్సవం చేస్తారు. ఆలయ ఉత్సవం అనంతరం శ్రీస్వామిఅమ్మవార్లకు పుష్పోత్సవం, శయనోత్సవం నిర్వహిస్తారు.