శ్రీశైల దేవస్థానం:
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో పదవరోజైన మంగళవారం ఉదయం శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి. తరువాత శ్రీ స్వామివారి యాగశాల లో శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపారు.రుద్రహోమం, చండీహోమం జరిపించారు.
తరువాత యాగ పూర్ణాహుతి, వసంతోత్సవం, అవబృథం, త్రిశూలస్నానం, కార్యక్రమాలు జరిగాయి.
పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సుగంధ ద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగ కార్యక్రమాన్ని పూర్తి చేసారు.
అనంతరం జరిగిన వసంతోత్సవంలో ఆలయ అర్చకులు, వేదపండితులు వసంతాన్ని (పసుపు, సున్నం కలిపిన మంత్ర పూరిత జలం) సమంత్రకంగా భక్తులపై ప్రోక్షించారు.
తరువాత జరిగిన అవబృథస్నానంలో చండీశ్వరస్వామికి ఆలయ పుష్కరిణి వద్ద ఆగమ శాస్త్రోక్తంగా స్నపన కార్యక్రమం నిర్వహించారు. చివరగా త్రిశూలస్నాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ పూర్ణాహుతి కార్యక్రమములో జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి, ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్నాయుడు, కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకస్వాములు, అధ్యాపక (స్థానాచార్యులు) వేదపండితులు తదితరులు పాల్గొన్నారు.
