శ్రీశైలక్షేత్రంలోని చారిత్రక సంపద పరిరక్షణకు చర్యలు-ఈ ఓ

 శ్రీశైల దేవస్థానం:శ్రీశైలక్షేత్ర చారిత్రక సంపద పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కార్యనిర్వహణాధికారి  ఎం.శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా క్షేత్రంలోని పలు ప్రాచీన శాసనాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.

పరిపాలనాంశాల పరిశీలనలో భాగంగా కార్యనిర్వహణాధికారి  స్థానిక పొట్టి శ్రీరాముల విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు  ఆర్. చంద్రశేఖరరెడ్డి తో కలసి క్షేత్రంలోని పలు పురాతన కట్టడాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ దివ్యక్షేత్రంగా, పవిత్ర తీర్థంగా, భక్తి – ఆధ్యాత్మిక కేంద్రంగా, సాంస్కృతిక, విద్య, వైద్య నిలయంగా శ్రీశైలక్షేత్రం వెలుగొందిందని చెప్పేందుకు క్షేత్ర చారిత్రక సంపద ఎంతగానో దోహదపడుతుందన్నారు. అందుకే క్షేత్రంలోని చారిత్రక సంపద పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.

ఇటీవల పునరుద్ధరించిన పంచమఠాలను భక్తులు ఒకేసారి దర్శించేందుకు వీలుగా అన్ని మఠాలను కలుపుతూ ( ఒకేసర్క్యూట్గా) ఏకదారిని నిర్మించే పనులను ప్రారంభించేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.

విభూతి మఠం ముందు భాగములో ప్రాచీనమెట్ల మార్గానికి తగు మరమ్మతులు చేపట్టి ఆ మార్గాన్ని పునరుద్ధరించేందుకు కూడా చర్యలు చేపట్టాలని ఈ ఓ  ఆదేశించారు.

ముఖ్యంగా క్షేత్రంలో పలుచోట్ల గల ప్రాచీన రాతి విగ్రహాలను తగు విధంగా పరిరక్షించాలన్నారు. పంచమఠాల ప్రాశస్త్యం తెలిసే విధంగా క్షేత్ర పరిధిలో అక్కడక్కడ సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ మరియు శ్రీశైలప్రభ విభాగాన్ని ఆదేశించారు.

 రుద్రాక్షమఠం, విభూతిమఠ సమీపములో పురాతన చిత్రలిపి ఉన్నట్లుగా చరిత్రకారులు గుర్తించడం జరిగిందన్నారు. ఈ మఠాల సమీపములో బండపరుపుపై ( షీట్రక్పై)ఈ చిత్రలిపిని గుర్తించడం జరిగిందన్నారు. ప్రాథమికంగా వీటికాలం ప్రస్తుత వ్యవహార ఆంగ్ల కానికి చాలా పూర్వంనాటివిగా పలువురు చరిత్రకారులు భావిస్తున్నారన్నారు. చరిత్ర నిపుణుల సహకారముతో ఈ చిత్రలిపి విశ్లేషణకు చర్యలు చేపడతామన్నారు. ఇందుకుగాను చరిత్ర, శాసన పరిశోధకుల సలహాలను తీసుకోవడం జరుగుతుందన్నారు.

దేవస్థానం  ఉద్యానవనాలలో కూడా మరింతగా బిల్వం, కదంబం, ఉసిరి మొదలైన దేవతా వృక్షాలను నాటాలన్నారు.సందర్శకులలో అవగాహన కలిగేందుకు ఆయా ఉద్యానవనములో చెట్లవద్ద వాటి సాధారణ నామం, శాస్త్రీయ నామం తెలిసే విధంగా నామ ఫలకాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఈ పరిశీలనలో సహాయ స్థపతి ఐ.ఉమావెంకట జవహర్లాల్ ఎడిటర్ డా. సి. అనిల్ కుమార్  తదితర సిబ్బంది పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *