
శ్రీశైల దేవస్థానం:దేవస్థానం లో ప్రసాదాల తయారీ గురించి భక్తులు ఎలాంటి ఆందోళనలకు లోనుకాకూడదని ఈ ఓ అన్నారు. లడ్డుప్రసాదములో ఆదివారం ఒక భక్తుడు బొద్దింక వచ్చినట్లుగా దేవస్థానం సిబ్బందితో వాగ్వివాదం చేసినట్లుగా దేవస్థానం దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు.ఈ ఓ వివరణ ఇది. దేవస్థానములో తయారు చేసే అన్ని ప్రసాదాలు కూడా ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా పూర్తి నియమ నిష్ఠలతో , శుచీ శుభ్రతలతోనే తయారు చేస్తారు. అదేవిధంగా ప్రసాదాల తయారీకి కూడా నాణ్యమైన సరుకులే వినియోగిస్తారు. ఈ సరుకుల నాణ్యతను కూడా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు.
కాగా లడ్డు ప్రసాదాల తయారీలో నిర్దిష్ట విధానం పాటిస్తారు. బూందీ తయారీ నుంచి లడ్డు ప్రసాదాన్ని ఉండలు కట్టేంతవరకు కూడా పలు జాగ్రత్తలు వుంటాయి. ముందుగా అత్యంతవేడిగా ఉన్న నెయ్యిలో బూందీ తయారు చేస్తారు . తరువాత బూందీని వేడితో ఉన్న పాకంతో కలిపి లడ్డు ప్రసాదాలు తయారు చేస్తారు. తరువాత తీపి బూందీ ఆరవేసినప్పుడు కూడా పలు జాగ్రత్తలు వుంటాయి.
శుచీ శుభ్రతలకు సంబంధించి చేపట్టే చర్యలలో భాగంగా లడ్డుప్రసాదాలు తయారు చేసే వంట సిబ్బంది, లడ్డును ఉండలుగా చేసే సిబ్బంది తలపై హెడ్ క్యాప్ను, చేతికి తొడుగులను ధరించి వుంటారు. అదేవిధంగా ప్రసాదాన్ని ఉండలుగా కట్టేముందు తీపి బూందిని ఆరబెట్టినప్పుడు కూడా ప్రత్యేకంగా ఫ్యాన్లు ఏర్పాటు చేస్తారు.
ఈ లడ్డు ప్రసాదాల తయారీ మొత్తం కూడా సీసీ కెమెరాలలో రికార్డు చేస్తారు.
లడ్డుపోటును (లడ్డుతయారీ కేంద్రాన్ని) ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తారు. అదేవిధంగా శుభ్రపరిచే సమయంలో తగువిధంగా సాంకేతికపరంగా క్రిమి సంహారకాలను కూడా వినియోగిస్తారు.ప్రసాదాల తయారీ ప్రక్రియనంతా సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. లడ్డు ప్రసాదములో బొద్దింక వచ్చే అవకాశం ఏ మాత్రం ఉండదు. ప్రసాదాల తయారీలో దేవస్థానం పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలకు ఐ.ఎస్.ఓ – 22000 : ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ ధృవీకరణ కూడా లభించింది.
ప్రసాదాల తయారీ గురించి భక్తులు ఎలాంటి ఆందోళనలకు లోనుకాకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
గతంలో అనగా ఫిబ్రవరి 2024లో కూడా పులిహోర ప్రసాదములో ఎముక వచ్చినట్లుగా కూడా ఒక భక్తుడు పేర్కొనడం జరిగింది. అప్పట్లో ఇది అవాస్తవమని అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు , దేవస్థానం వేదపండితులు పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.
శ్రీశైలక్షేత్ర ప్రతిష్టను, భక్తుల మనోభావాలను భంగపరిచేవిధంగా జరిగే ఇటువంటి సంఘటనలు ఎంతో మనోవేదన కలిగిస్తాయి. అంతేకాకుండా పలు సందేహాలు కూడా ఏర్పడుతాయి. ఈ విషయంలో భక్తులందరూ సంయమనంతో వ్యవహరించవలసినదిగా కోరుకుంటున్నాము. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగినా, ఎలాంటి సమస్యలు ఏర్పడినా వెంటనే కార్యనిర్వహణాధికారి కి, సంబంధిత విభాగాధికారులకు తెలియజేయవచ్చును.